29, ఏప్రిల్ 2013, సోమవారం

Mangamma Sapatham



 


  అనుకోకుండా,నిన్న ఒక టీ.వీ. చానెల్ లో ' మంగమ్మశపథం B& W సినిమా  ' మంగమ్మ శపథం 'చూసాను.కథ కేమిటిలే జానపదకథ.కాలక్షేపానికి బాగానేఉంది. యవ్వనం తొలగని అందాల తారలు N.T.రామారావు.జమున,హీరో,హీరోయిన్లు.రామారావు రెండు పాత్రలు తండ్రీ,కొడుకూ బోనస్.  పైగా రామారావు,జమున ఇద్దరికీ మారువేషాలు!
  సంగీతం మధురంగా ఉంది.L.విజయలక్ష్మి నృత్యాలు మనోహరంగాఉన్నాయి.అంచేత చూడవచ్చును.
  ఈకథ అంతకుముందు రెండు సార్లు తీశారు.వైజయంతీమాల  తల్లి వసుంధర తో మొదటిసారి ,రెండోసారి భానుమతితోను తీసారు.పాపులర్ కథా ,స్టార్సు కాబట్టి  మూడు చిత్రాలూ విజయవంతమయాయి.   

rendu navalalu.




  ఈ మధ్య రెండు నవలలు చదివాను.రెండూ ' వాహినీ బుక్ ట్రస్ట్,హైదరబాదు 'వారు ప్రచురించినవి.' రచన 'మాసపత్రికలో ధారావాహికంగా వచ్చినవి.
   1.'తపన '-రచయిత;కాశీభట్ల వేణుగోపాల్.; వెల;రూ.60\
     చైతన్యస్రవంతి విధానంలో రచించినది.ముఖ్య పాత్ర subconscious లోని భావతరంగాలని పైకి వెలిబుచ్చుతూ ,దాచకుండా రాసినదీ.4,5,రోజులలో భార్యాభర్తల మధ్య జరిగిన సంఘటనలనీ,వారి సంబంధాలనీ యథాతథంగా చిత్రించారు. కాని, వారిద్దరికీ  ఎందుకు,వైమనస్యమో,ద్వేషమో అర్థంకాదు.అందుకు బలమైన కారణాలు కనిపించవు.చివరకు,భార్య  గర్భవతి ఐందని తెలియగానే మళ్ళీ పరస్పరం సామరస్యం,అనురాగమూ కలుగుతాయి.ఇందులో హీరో తాగుబోతు,వ్యభిచారి.కాశీభట్ల నవలల్లో ఈ గుణాలు ఎక్కువగా కనిపిస్తాయి.బహుశా,ఇవి లోకంలో సహజమూ,సామాన్యమూ ఐపోయాయి కాబట్టి తప్పులేదని రచయిత ఉద్దేశం కావచ్చును.
  ఈ నవలకు 1999 లో 'తానా-స్వాతి ' నవలల పోటీలో లక్ష రూపాయలు బహుమతి వచ్చిందట.
   2.ఐ.సి.సి.యు.(I.C.C.U.) రచన;డా.చిత్తర్వు మధు.వెల 100\ రూ.
    ఇది కూడా 'రచన ' పత్రికలో సీరియల్ గా వచ్చింది.మెడికల్ థ్రిల్లర్ genre  కిందికి వస్తుంది.ఒక పెద్ద హాస్పటల్ లో గుండెజబ్బుల కు నిర్దేశించిన ఎమర్జెన్సీ I.C.C.U. వార్డులో ఒక నిపుణుడు  గుండె చలనాల్ని సరిగా నియంత్రించే  పేస్ మేకర్ pace maker ' అనే పరికరాన్ని  అమర్చుతుంటాడు.ఇది సామాన్యంగా జరిగే ప్రక్రియే.కాని దుష్టస్వభావమూ, దురాశా ,అమితమైన ambition కల అతదు ఆ పరికరంలోనే రోగి మెదడుని కంట్రోలు చేసే మరొక చిన్న పరికరాన్ని కూడా చేర్చి దాని ద్వారా ధనవంతులైన రోగుల నుంచి  డబ్బు సంపాదిస్తాడు.అంతటితో ఆగక తన దగ్గర గుండె జబ్బు కనివచ్చిన రాష్ట్ర ముఖ్య మంత్రి ని కూడా ఆ పరికరంతో కంట్రోలు చేస్తాడు.ఈ లోగా కొత్తగాచేరిన మంచి డాక్టర్ అనుమానించి  ,పరిశోధించి ఆ కుట్రను భగ్నం చేస్తాడు.విలన్ డాక్టర్ అగ్నిప్రమాదంలో చనిపోతాడు.
     ఉత్కంఠతో చకచకా సాగే నవల ,ఆసక్తితో చదివిస్తుంది.రచయిత డాక్టర్ కాబట్టి మెడికల్ నేపథ్యాన్ని బాగా చిత్రింప గలిగారు.ఇంగ్లీషులో వచ్చిన రాబిన్ కుక్  మెడికల్ థ్రిల్లర్లని తలపింపజేస్తుంది.



 
       

23, ఏప్రిల్ 2013, మంగళవారం



 


   వరచిరకర కిరణాభరణా,మణిదీపిత మకుటాభరణా
     చంద్రాతపకారణ, ఘనతిమిరహరణా
   జీవనకాలాంకిత మేఘావరణా,జలనిధిధనశోషణ
      అణుశక్తిస్థలభీషణ,సర్వగ్రహవర్తుల చారణ
   భువనైకశరణా ,కృత జననమరణా
     సకలజన చేతనపోషణ
   సురనరమునివర  వందితచరణా
     జయసర్వాత్మక,జయ అరుణారుణ
   జయజయ ప్రత్యక్ష  శ్రీమన్నారాయణ.           

15, ఏప్రిల్ 2013, సోమవారం

Jaipoor tragedy.




  ఈ వేళ  జైపూర్ లో జరిగిన దారుణ ప్రమాదం ,ప్రజల నిర్లక్ష్యము  టీ.వీ.లో చూసేఉంటారు.మనకెందుకు ఈ బెడద అని ఇక్కడ కూడా అలాగే జరగవచ్చును.కాని దక్షిణాదికీ ఉత్తరాదికీ భేదం తెలుస్తున్నది.
 1.ఈ ప్రమాదం  ఎక్కడో మారుమూల జరగలేదు.జైపూర్ మైన్ రోడ్ మీద జరిగింది.
 2.తాముస్వయంగా సాయంచెయ్యకపోయినా, సెల్ ఫొన్ ద్వారా పోలీసులకు.ఆంబులెన్స్ కి తెలియజేయవచ్చును కదా?
  3.అక్కడ మనలాగ 100,108 సర్వీసులు లేవా?
  4.ప్రభుత్వసర్వీసులు మనకన్నా అధ్వాన్నం గా ఉన్నట్టు ఉన్నది.
 5.అన్నిటికన్నా ఘోరం గంట సేపు విడియో తీసిన మీడియా వాళ్ళు ఎందుకు సహాయం చెయ్యలేదు?మానవత్వం మంట గలిసిందని పాటలు పాడినవారి మానవత్వం ఏమైంది? 

13, ఏప్రిల్ 2013, శనివారం

dharmasandeham.




  నాకొక ధర్మసందేహం.పండితులనడుగుతే చెప్పలేకపోయారు.వారికి పాండిత్యమేకాని చారిత్రక దృక్పథం ఉండదు కదా!. ఇంతకీ నా ధర్మసందేహమేమంటే;రామాయణ,భారత కాలాల్లో వ్రాత,లిపి ఉండేదా?ఆరెండు గ్రంధాల్లో  అందుకు ఆధారం కనబడదు.'' నా మాటగా ఇలా చెప్పమని సందేశమేగాని లేఖలు పంపడం  కనబడదు.వ్యాసుడు ,వినాయకుడికి చెప్తే అతడు రచించినట్లు కట్టుకథ ఉన్నదికాని దానికి మహాభారతంలో  ఆధారం కనబడదు. సింధునాగరకత  నుంచి ఆర్యులు లిపిని,వ్రాతను తెచ్చుకున్నట్లు నేను అనుకొంటున్నాను.అంతవరకు,చదువు,కవిత్వం అన్నీ మౌఖికమే.
     దీనిపై శాస్త్రీయ ఆధారాలతో, చారిత్రక  జ్ఞానం తో ఎవరైనా విజ్ఞులు వ్యాఖ్యానిస్తే ఆనందిస్తాను.      

12, ఏప్రిల్ 2013, శుక్రవారం

Mourya dynasty


 


  అశోకుడు-మౌర్యవంశ క్షీణత;మనకు అశోకుడి గురించి కొంచెం తెలిసి ఉంటుంది.కాని తరవాత ఆ వంశం గురించి తెలియదు.తర్వాత 40 సంవత్సరాలలో మౌర్యవంశం ఎలా ,ఎందుకు అంతరించిందో యీ పుస్తకంలో వివరించబడింది.అంతే కాదు. ఆ కాలంలో ఆర్థిక,సాంఘిక,రాజకీయ పరిస్థితులు,ప్రజాజీవనం,విదేశసంబంధాలు,వర్తకవాణిజ్యాలు,స్త్రీల పరిస్థితి మొదలైనవి బౌద్ధ,హిందూ మతాల సంబంధాలు,సంఘర్షణల గురించి వ్రాయబడింది.చిత్రంగా,మన పురాణాలలోని,వంశచరిత్ర,ఇందులో చరిత్ర దాదాపు ఏకీభవిస్తున్నాయి.ఆసక్తి వున్నవారు చదవవచ్చును.
   పుస్తకం పేరు; -అశోకుడు- మౌర్యవంశ క్షీణత
   రచయిత;- డా;రొమిల్లా థాపర్
   అనువాదం;-డా;బి.యస్.యల్.హనుమంతరవు.
   ప్రచురణ;- విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. హైదరబాదు.
   ద్వితీయ ముద్రణ.1993
   @Indian council of Historical research.
    వెల;రూ.50\
    పుటలు; 300.                              
    

11, ఏప్రిల్ 2013, గురువారం

Seasons




 నేటి ఉగాదితో  వసంతఋతువు  ప్రవేశించింది.కాని అప్పుడే ఎండలు  ముదిరాయి.కాని సాయంకాలం,రాత్రి ,చల్లగాలితో బాగానేఉన్నాయి.పగలు మాత్రం వేడిగా ఉంది.poorman's OOTYఅని పేరుబడిన ఈవూళ్ళోనే ఇలా ఉంటే ఇంక గుంటూరు,కడప, రామగుండం లో ఎలా ఉంటుందో ?మాపెరట్లోఉన్న చెట్ల మీద కోకిలారావాలు వినిపిస్తున్నవి.మామిడిపూత, చిన్న పిందెలు ఉన్నాయి.మల్లెలు ఇంకా ఇప్పుడే తొలి మొగ్గలు తొడుగుతున్నవి.
  కాని కవులు వర్ణించే ఋతువర్ణన మన ఆంధ్రప్రదేశ్,తమిళనాడు (దక్షిణభారతం) కన్నా ఉత్తరాది,ముఖ్యంగా,హిమాలయప్రాంతానికి వర్తిస్తుందనుకుంటాను.మనకి వసంతంలో మండే ఎండలు,శరత్తులో ముసుర్లు,తుఫానులు.convention ప్రకారం కవులు వర్ణిస్తారు.ఏమైతేనేమి ఉగాది   శుభకామనలతో ముగిస్తాను.
  

UGADI



 

 మిత్రులందరికీ,పిన్నలకు,పెద్దలకు,విజయనామ నూతన సంవత్సర శుభాకాంక్షలు,హార్దికాభినందనలు;నా యీ పద్యాన్ని కాస్త వీక్షించండి.
     కించిదరుణరాగ కిసలయసందోహ
       ఫలభార వినమిత పాదపములు,
     పంచమస్వర విశేషాంచిత కుహుకుహూ
       మత్తకోకిల గాన మధురిమలును,
     నాతిశీతలవాత జాతనీహారికా
        సంఛన్న సకలదిశాంతములును
     ధవళమౌక్తిక రోచి తారహారావళీ
        శుభ్రనీలాకాశ శోభితమ్ము
     
      నూత్నవస్త్రాభరణ ధార ణోత్సుకతలు,
      ప్రణయ భావనోద్దీప యౌవన విలాస
      మల్లికాదామ సుమపరీమళము లలర,
      వచ్చెనుగాది పర్వదినంబు; స్వాగతమ్ము
      పల్కుడీ సుహౄజ్జన మిత్ర బంధులార !