22, డిసెంబర్ 2014, సోమవారం

20, డిసెంబర్ 2014, శనివారం

Sri.D.V.Subbarao.




 శ్రీ డి.వి.సుబ్బారావుగారి తో నాకు బాగా పరిచయముంది.ఆయన వివిధరంగాల్లో ప్రసిద్దికెక్కారు. న్యాయవాదిగా,క్రికెట్ అఫిషియల్గా,విశాఖ మేయర్గా వినుతిచెందారు.ముఖ్యంగా  మేయర్గా విశాఖను సుందరంగా అభివృద్ధి చెయ్యడంలో ఆయన కృషి ప్రశంసనీయం.వ్యక్తిగా కూడా స్నేహశీలుడు,నిజాయితీపరుడు, మేధావి .ఆయన మరణవార్త నన్ను కలచివేసింది.అయనకు నా నివాళి, శ్రద్ధాంజలి అర్పిస్తున్నాను.ఆయన కుటుంబసభ్యులకు నా సానుభూతి  తెలుపుకొంటున్నాను.

17, డిసెంబర్ 2014, బుధవారం

premature deaths


 
శీర్షిక
--------
  ఈ మధ్య కొందరు ప్రముఖులు,సినీ,సాహితీ,రాజకీయ రంగాలలోవారు అకాల మృత్యువు బారిన పడుతున్నట్లు చదవడం కలవరపెడుతున్నది. ప్రసిద్ధులు కాకపోయినా ఇతర రంగాలలో కూడా ( వైద్యరంగంతోసహా) ఇలాగే జరుగుతున్నది.కర్మానుసారం జరుగుతుందనే  మాట పక్కన పెడితే,మానవ ప్రయత్నాలు ఏం చెయ్యాలంటే;
    1.40సం:దాటిన ప్రతి మనిషి  ఏడాదికొకసారి  మెడికల్ చెకప్ చేయించుకోవాలి.
    2.చెకప్ లో  ఏవైన,అధిక రక్తపోటు మధుమేహలక్షణాలు కనిపిస్తే  తగిన చికిత్స తీసుకోవాలి.
     3.మద్యపానం,ధూమపానం మానివేయాలి.
   4.  డబ్బు సంపాదించాలి కాని దానికోసం ఆరోగ్యాన్ని బలిపెట్టకూడదు.
      5.జీవితవిధానాన్ని life style ని తగిన విధంగా మార్చుకోవాలి. ఆహరనియంత్రణ,తగుమాత్రం వ్యాయామం  అవసరం.
     6.ముఖ్యంగా  జబ్బుని దాచుకోకూడదు.జీవితభాగస్వామి,లేక దగ్గరి బంధువుల సహకారం తీసుకోవాలి. 

11, డిసెంబర్ 2014, గురువారం

కమనీయం: o,visakhaa!

కమనీయం: o,visakhaa



  !

o,visakhaa!


 

 విశాఖా!ఓ విశాఖా,నావిశాఖా!
----------------------
     
          పసిప్రాయంలో నీ వడిలో పరుండితి,
          నీలతరంగ హస్తాలతో నిమిరావు నన్ను.
          ఎల జవ్వనములో కోరి వలచాను నిన్ను,
 తరులతా కుంతలాల మురిపించావు నన్ను
          సుందర విశాఖా!విలాసరేఖా!

            నీ శైల కందరాలలో
            సానుప్రదేశాలలో
            సైకతచుంబిఫేనరాశుల్లో
            సంధ్యామారుతసౌరభాల్లో
            చంద్రోదయసువర్ణరోచుల్లో
            అలలపై జలతారుదారుల్లో
            ఉదయారుణజలదపంక్తుల్లో
            ఆడియాడి అలసి నిదురించాను
               సుందరవిశాఖా! విలాసరేఖా!
             సుదూరంలో నౌకోపరితలం నుండి
             నీహారదుకూలపరీవృతమైన
             నీ తీర సౌభాగ్యాన్ని తిలకించినాను .
             తిలకించి,తిలకించి పరవశించాను
                సుందరవిశాఖా!విలాసరేఖా!
                 విశాఖా!,ఓ విశాఖా,నా విశాఖా!  

22, నవంబర్ 2014, శనివారం

naming the Capital


 


  ఇంతకు ముందొకసారి రాసాను.ఇప్పుడు మళ్ళీ రాజధాని  పేరుగురించి పత్రికల్లో వేసారుకాబట్టి మళ్ళీ రాస్తున్నాను.NTR నగర్ అనిపేరుపెట్టాలని కొందరు మంత్రులు ప్రతిపాదించినట్లు తెలుస్తున్నది.దీనిని నేను వ్యతిరేకిస్తున్నాను. .కారణాలు ;;
  1.యన్.టీఆర్.పేరు ఒక వర్గం వారిని,పార్టీ వారిని సంతృప్తి పరచవచ్చును.కాని చాలామంది ఇతరులకు ఇష్టపడదు.
  2.NTR  అని ఇంగ్లిష్ లో రాయవలసి వస్తుంది. అదీగాక ఒక వ్యక్తి పేరు పెట్టడమెందుకు?
  3.కాబోయే రాజధాని పూర్వం ఆంధ్రదేశాన్ని 400 సం; పాలించిన ఆంధ్రశాతవాహన చక్రవర్తుల రాజధాని ఐన 'అమరావతి ' దగ్గరే. అందువల్ల మన కొత్త రాజధానికి 'అమరావతి ' అని పేరు పెట్టడమే సముచితంగా ఉంటుంది.ప్రజలంతా ఆవిధంగానే ప్రభుత్వాన్న్ డిమాండ్ చేస్తే బాగుంటుంది.

10, నవంబర్ 2014, సోమవారం

seemantam cheayistaam




 గర్భిణీ స్త్రీలకు ఉచితవైద్య సేవలు అందిస్తాము.పోషకపదార్థాలని ఇస్తాము.ప్రభుత్వ ఆస్పత్రులలో ఉచితంగా ప్రసవం చేయించి ,ఆడపిల్ల పుడితే  ధనసహాయం చేస్తాం.ఇంతవరకు బాగానే ఉంది. కాని ప్రభుత్వం (చంద్రబాబునాయుడు హామీలు) గర్భిణీలకు సీమంతం  ప్రభుత్వఖర్చుతో  చేయిస్తామనడం చవకబారు ప్రజాకర్షణ పథకం కాదా?పెళ్ళిళ్ళు ,గర్భాదానాలు కూడా ప్రభుత్వఖజానాలోంచి ఖర్చుపెట్టి చేయిస్తారేమో!అధికారముందని ఇలాటి వ్యర్థపథకాల్ని ప్రవేశ పెట్టడమేనా? 

31, అక్టోబర్ 2014, శుక్రవారం

Name of the capital




  రెండు విషయాల గురించి గట్టిగా వ్రాయదలుచుకొన్నాను.
   1.ఆంధ్రప్రదేష్ రాజధాని;మన రాజధాని గురించిస్థలనిర్ణయం జరిగిపోయింది .కాబట్టి పేరు కూడా నిర్ణయమైపోవాలి.అమరావతి 400సంవత్సరాల కాలం ప్రాచీన విశాల సామ్రాజ్యానికి  రాజధాని.ఇంచుమించు ఆప్రదేశంలోనే ఇప్పుడు రాజధానిని నిర్మించబోతున్నారుకాబట్టి అమరావతి అనిపేరుపెట్టడమే సముచితం.ఏ వ్యక్తి పేరు పెట్టడం బాగుండదు. అమరావతే మనరాజధాని.
    2.నవంబర్ 1వ తేదీ ఆంధ్రప్రదేశావతరణ   జరిగింది.ఆ తేదీనే మనం పండుగగా జరుపుకొంటున్నాము.జూన్ 2వతేదీన అందులో ఒకభాగం విడిపోయింది.ఆ తేదీని తెలంగాణా వారు జరుపుకోనిండి .మనరాష్ట్రావతరణ దినోత్సవం మాత్రం నవంబర్ 1వతారీకే.మార్చకూడదు.జూన్2 విషాదదినం.ఆరోజు జరుపుకోవడమేమిటి అర్థంలేకుండా.ఇలాంటి సలహాలు ప్రభుత్వానికి ఇచ్చిన కుహనామేధావులెవరు?
       ఈ రెండు విషయాల గురించి ప్రజలుగట్టిగా అడగాలి.బ్లాగు మిత్రులనుంచి స్పందనలు,అభిప్రాయాలు కోరుతున్నాను.  
    

janjhavati kathalu=contd(Final)



 మొత్తం మీద ఈ 21 కథలను పరిశీలిస్తే ఇవన్నీ తీవ్రవాద వామపక్ష ధోరణిలో వ్రాసినట్లున్నది.నీటిప్రాజెక్టులకీ,విద్యుత్ ప్రాజెక్టులకీ ఈ రచయితలంతా వ్యతిరేకులని అనిపిస్తున్నది.ఒక ఎకరా కూడా లేని  భూమితో5,6,మంది ఎలాజీవిస్తారు? చిన్న కమతాలు పోవడం మంచిదే కదా!ఒకప్పుడు వీరు ఎదుటి వారిని ఏ కారణాలతో అభివృద్ధి  నిరోధకులన్నారో ,ఇప్పుడదే కారణాలతోపర్యావరణరక్షణ పేరుతో సమర్థిస్తున్నారు.పర్యావరణసమ్రక్షణ మంచిదే.కాని అభివృద్ధి చెందిన ఫ్రాన్స్,జెర్మనీ ,స్విస్స్ వంటి దేశాలు పర్యావరణని   కాపాడుకొంటూనే నగరాలనీ,సంపదనీ.అభివృద్ధినీ సాధించుకోలేదా?
   ఈ కథలు వివిధ కాలాల్లో దశకాల్లో రాసినట్లు కనిపిస్తుంది.కాని దేశంలో జరిగిన,జరుగుతున్న,అభివృద్ధి మాత్రం వీరికి  కాబట్టినట్లు లేదు.పేదరికంతగ్గిందికదా!లేబరుకెంత డిమాండు వుందిప్పుడు?రచయితలు దేశంలో వస్తున్న మంచి, చెడ్డ ,అన్ని మార్పుల్ని బాగా అధ్యయనం  చెసి రాస్తే మంచిదనుకొంటాను.
       ఈ కథా రచయితలందరూ నిష్ణాతులని ముందే పేర్కొనడం జరిగింది.కొన్ని కథాంశాలు,కథనం బాగున్నవని చెప్పవచ్చును.కాని కొన్ని  కథలకు ముగింపు స్పష్టంగా లేదు.కొన్ని కథల్లో  రచయిత చెప్పడంలో గందరగోళంలో పడినట్లు అనిపిస్తుంది.
        ఐనా ఈ కథాసంకలనం శ్రీకాకుళసాహితివారి మంచి ప్రయత్నం అని చెప్పాలి.జిల్లాలోని నదులపేర్లతో కథాసంకలనాలు ప్రచురిద్దామన్న వీరి ప్రయత్నం అభినందనీయం.ఇప్పటికి నాగావళి,వంశధార పేర్లతో రెండు సంపుటాలు వెలువడ్డాయి.ఇది మూడవది.ఇంకా మరికొన్ని వెలువడవచ్చును.వీటన్నిటినీ చదివితే ఉత్తరాంధ్రప్రజా జీవితం,పరిస్థితులు,ఇటీవలి చరిత్ర గురించి పాఠకులకు ఒక అవగాహన ఏర్పడుతుంది. కథరచించిన కాలం పేర్కొనిఉంటే బాగుండేది.
                           (సమాప్తం)  

30, అక్టోబర్ 2014, గురువారం

JANJHAAVATI KATHALU--REVIEW--3rd part




  ఉత్తరాంధ్ర ప్రసిద్ధ కథారచయిత రెడ్డిశాస్త్రి గారి కథ ' అస్తమయం ' :లచ్చయ్య దిక్కులేని ముసలాడు.ఎలాగో వూరివాళ్ళ సాయంతో కాలం వెళ్ళబుచ్చుతుంటాడు.అతడి నేస్తం గురయ్య మరో వృద్ధుడు.చాలీ చాలని బతుకు తెరువుమాత్రం ఇస్తున్న చిన్న మెట్టపొలాన్ని అమ్మేసి పట్నానికి పోయి పనిచేసుకొని బతుకుదామని  కొడుకు పోరుపెడుతుంటాడు.ఆ మాటచెప్పి గురయ్య లచ్చయ్య సలహా అడుగుతాడు.లచ్చయ్య ఎటూ చెప్పలేకపోతాడు.చివరకు,తరాలు మారేయని,కొడుకు చెప్పినట్లేచెయ్యమని చెప్తాడు.పొలం అమ్మడం యిష్టం లేని గురయ్య నూతిలోపడి  మరణిస్తాడు.లచ్చయ్య షాక్ తో మరణిస్తాడు.ప్రజలు ' రెండూళ్ళ ముదర బుర్రలు మరి లేకంటా పోయాయి ' అనుకొంటారు.
  వ్యవసాయం గిట్టుబాటుగాక  రైతులు పట్టణాలకి వలసలుపోవడం  ఈ కథలో ప్రధానాంశం.
      ఇక మిగతా కథల గురించి క్లుప్తంగా;--
    'కళింగ ఎక్స్ ప్రెస్ ' (కొప్పల భానునూర్తి) కూడా వలసలగురించి : మొదళ్ళు-చిగుళ్ళు (దాసరి రామచంద్రరావు) బాలకార్మికుల స్థితి ,పిల్లలు స్కూలులో చదువుకొంటూ ఒకవైపు,పనుల్లోకి వెళ్ళవలసిన అవసరం  ఇంకొకవైపు అనే అంశం గురించి."భస్మసిమ్హాసనం' (పంతుల కమలకుమారి" ) కలవంటి కథ.పల్లెల్ని ధ్వంసం చేసి పరిశ్రమలు పెట్టడం గురించి,మత్స్యకారుల జీవితాలలోని కష్టాలగురించి కథాంశం. 'ఆటుపోటు " (చింతాడ తిరుమలరావు) ,రెక్కసాగనికథ(నాగులమహంతి రమణమూర్తి) ఈ రెండు కథలు మధ్యతరగతి చాలీచాలని ఆదాయాల గురించి
 "విరమణలేని కథ"(ఉపాధ్యాయుల గౌరీశంకరరావు)  ఒక మధ్యతరగతి ఉద్యోగి పనిచేసే మిల్లు మూతపడడంతో  యాజమాన్యం ఇచ్చిన పరిహారం చాలకపోగా ,మళ్ళీ వేరే ఉద్యోగం కోసం ప్రయత్నంలో తిరుగుతూ ఉండడం కథాంశం"అనగనగా ఒకరోజు " (పత్తి సుమతి ) పిల్లల చదువు గురించి ఒక గృహిణి పడే పాటులు .''భూతాలసొరగం ''(చింతా అప్పలనాయుడు)  ఒక జంగందొర కాలమానపరిస్థితుల వల్ల తన పాటకి ప్రోత్సాహంలేక ఆదాయంలేక పడే అవస్థల గురించి. ''నీడ '' (పి.వి.నర సిమ్హారావు ) తనకి కొంత ధనసహాయంజేసి,తాను కట్టుకొన్న యింటినే కాజేద్దామనుకొన్న  షావుకారు కి ఎదురుతిరిగి ఇంటిని కాపాడుకొన్న వైనం.''బందెలదొడ్డి '' (కె.వి.కూర్మనాథ్ ) బందెలదొడ్డి లో పెట్టిన పశువులు ,మనుషులు,ముఖ్యంగా తమ యజమానులగురించి వాటి అభిప్రాయాలు చెప్పుకొంటూ మాట్లాడుకొడం  తమాషాగా ఉంటుంది. ''చెలగాటం ''( ఆప్తచైతన్య ) మన్యప్రాంతంలోని హాస్టల్లో ఒక గిరిజనకుర్రాడికి జబ్బుచేస్తే వాడికేమైనా అయితే తన పీకకుచుట్టు కుంటుందని  హెడ్మాస్టర్ కొంత డబ్బిచ్చి వాడిని తండ్రితో ఇంటికి పంపించేస్తాడు. ''పిల్లలకోడి '' (ఆర్.రామక్రిష్ణ) ఇది కూడా పారిశ్రామీకకరణం భ్రమలో పడి ,పొలాలు వదలుకొని పట్టణాలకి వలస పోవద్దని ఉద్బోధించే కథ.
                                (ఇంకా వుంది) 

29, అక్టోబర్ 2014, బుధవారం

janjhavati kathalu -2 (contd)


 మరొక కథ;' ముంపు ':గంటేడ గౌరినాయుడు గారు  రాసినది.నాగావళితీరప్రాంతంలో నీటి ప్రాజెక్టు గురించి ఒక పల్లెలో జరుగుతున్న చర్చలు,వాదోపవాదాలు,ఆందోళనలుగురించి.ప్రాజక్టు వల్ల ముంపులో ఇల్లు ఖాళీ చేసిపోవలసి వస్తుందని ఒకపక్క  బెంగ.మరోపక్క నష్టపరిహారం వస్తుంది కదా దానితో ఏంచెయ్యాలని ఆలోచన.ప్రాజెక్టు ఇక్కడైక్కడకాదు దూరంగా ఎగువన కడితే మనకి మంచిదని వూరి మాస్టారి ఉపన్యాసం.కథకి పర్యవసానం ఏమీ లేదు.అనిశ్చితంగా ముగుస్తుంది.ఇంతకీ ప్రాజెక్టుకి  రచయిత అనుకూలమా,వ్యతిరేకమా అనేది తెలియదు.(దరిమిలా జంఝావతి ప్రాజెక్టు పూర్తి ఐనట్లు తెలుస్తున్నది.)
      జి.యస్.చలంగారి రచన 'పొగ 'అనే కథ.ఇది రోడ్డు రవాణా,పాఠశాలల  ప్రైవేటీకరణకి వ్యతిరేకం గా రాసింది.ప్రభుత్వం ఎలాగనిర్లక్ష్యం,దుష్పరిపాలన ద్వారా R.T.C.బస్సుల్ని ,ప్రభుత్వ స్కూళ్ళని నిర్వీర్యం.నిరుపయోగకరంగా,మార్చిరద్దుచేద్దామనిచూస్తున్నదో వివరించారు.ప్రయివేటు రవాణాని,విద్యని ఎలా ప్రోత్సహిస్తున్నదో ఆవైనం,దానికి వ్యతిరేకంగా కథా నాయకుడు పిడికిలి ముగించడంతో కథ ముగుస్తుంది.
  ' చేదుఫలం ' కథ పడాల జోగారావు రచన.గ్రామీణ సహకార  బాంకుల్లో,అక్రమాలు, అవి నడిచే తీరు వాటి లోతట్టు సమాచారంinside information  తో రాసినది.ముకుందం అనే  ఉద్యోగి  తనకిష్టం లేకపోయినా కొన్ని చర్యలలో  ఇరుక్కొని ఆ ఇబ్బందుల్లో నుంచి తనకున్న మంచిపేరు goodwill వల్ల బయటపడటం కథ.తోడి మేనేజర్లు బాగా ధనమూ,ఆస్తిపాస్తులు సంపాదించుకొన్నా  ,తాను మాత్రం అలాగే ఉండిపోవడం బంధుమిత్రుల విమర్శకి  గురి అవుతాడు.
   మరొక ప్రసిద్ధ కథకుడు అట్టాడ అప్పలనాయుడు రచించినదీ' షా--- '' అనే కథ. చదరంగంలో  ఎత్తులు,పైఎత్తులులాగే రాజకీయాల్లో వాటిగురించి విశదంగా రాసారు.పల్లెల్లోంచి వచ్చిన చిన్న పెట్టుబడిదార్లు ,పడమటినుంచి  వచ్చిన బడా పెట్టుబడిదార్ల   పోటీకినిలబడలేకపోవడం అందుకు ప్రతిగా మరొక    ఎత్తు వెయ్యడం ప్రధానాంశం.I.T.,PHARMA  కంపెనీల నీటి అవసరాలకోసం  ప్రాజెక్టు డిజైను మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకించి ప్రజల చేసే ఆందోళనని చిన్నపెట్టుబడిదారు ప్రోత్సహిస్తాడు.స్థానికప్రజల అవసరాల్ని తీర్చేవిధంగ మొదటి డిజైనుప్రకారమే నిర్మించాలని సామాన్యప్రజలతోబాటు లోకల్ సావుకార్లు కూడా పాల్గొంటారు.  

28, అక్టోబర్ 2014, మంగళవారం

janjhaavati kathalu-a review.




 జంఝావతి కథలు;శ్రీకాకుళ సాహితి వారి ప్రచురణ.
---------------------------------
శ్రీకాకుళ సాహితి వారు ఉత్తరాంధ్రలోని నదులపేర్లతో అక్కడి రచయితల కథా సంపుటాలు ప్రచురించుదామనే  సంకల్పంలో భాగంగా జంఝావతికథలు ప్రచురించారు.ఇందులో కథకులు చాలామంది ప్రసిద్ధులే.చాలాకథలు పత్రికల్లో వచ్చినవే.మొత్తం 21 కథలు ఇందులోఉన్నవి.
  కథకుల్లో  వామపక్ష తీవ్రభావ ధోరణి స్పష్టంగా ఉన్నది.  ఉత్తరాంధ్ర గ్రామీణ ప్రాంతాల జీవనంలో వచ్చిన మార్పులు,మానవ సంబంధాల  విచ్చిత్తి    కనిపిస్తుంది.
వ్యవసాయంలో వచ్చిన మార్కెట్ ధోరణి,రైతుల కష్టాలు గూరించికూడా చాలామంది రాసారు.దాదాపు అందరూ అక్కడి మాండలికం లోనే బాగారాసారు.కాని మళ్ళీ మనం 50,60,ఏళ్ళ వెనక్కి వెళ్ళగలమా,వెళ్ళడం మంచిదా అని నా సందేహం.
 మొట్టమొదటికథ; కాళీపట్నం రామారావు గారిది (కా.రా.మాస్టారు) '' అన్నెమ్మనాయురాలు " రైతు కుటుంబంలోని  పెద్దావిడ.పొరుగూరివారితో  కోర్టు వ్యాజ్యాలతో చాలాపొలం పోగా మిగిలినదానితో మనమడితో కలిసి కాలం గడుపుతూ ఉంటుంది.మనమడు పొలం అమ్మేద్దమంటాడు.లేకపోతే తనవాటా పంచి ఇమ్మంటాడు.చివరకి తప్పనిసరి అయి వాటా రాసి ఇచ్చేస్తుంది.తరాలలో వచ్చిన భేదం చిత్రిస్తుంది.కథ పెద్దగాలేదు.వ్యాసంలా ఉంది.కథలు రాయడం మానేసిన మాస్టారు మొగమాటానికి కథ రాసి ఇచ్చినట్లు  అనిపిస్తుంది.
  రెండో కథ ; ' సాటింపు ' B.V.A. రామారావు నాయుడు గారి రచన.ఉబ్బసవ్యాధితో బాధపడే చినజన్నోడు అమ్మవారిపండుగలో 'సిరిమాను '  ఎక్కకుండా తప్పించుకోడానికి పక్క వూరికి పారిపోతాడు.కాని ఊరిపెద్దలు అతని కొడుకు వెంకటిని సిరిమానుఎక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని విని,తిరిగివచ్చి తానే సిరిమాను  ఎక్కి ఊరేగింపులో మరణిస్తాడు. ఊరిపెద్ద కొడుకు రాజబాబుని నక్సలైట్లు కాల్చి చంపుతారు.సంబరం ఆగిపోతుంది.మూఢాచారాలకి,ఆధునిక భావాలకి మధ్య ఘర్షణని ఇంకా బాగా చిత్రించి ఉండవలసినది. కాని ఇంతటితో మూఢాచారాలు ఆగిపోతాయా అనే రచయిత ప్రశ్నతో కథ ముగుస్తుంది.
  మూడో కథ; మన్యం పల్లెలో  పండిన పంట అమ్ముతే షావుకారుకే  అమ్మాల. అతడే ధర నిర్ణయిస్తాడు.వాడిదే మొనోపలీ .ఒకసారి అలా అమ్మకుండా ఎదురు తిరిగితే  ముసలయ్యను,పొలీసుల ద్వారా దౌర్జన్యం చేయించి ,పంటని షావుకారుకే చేర్పిస్తారు.మన్యం ప్రజలని షావుకార్లు,పోలీసులు ఎలా  దోచుకొంటున్నారో తెలియజెప్పే కథ.    (ఇంకావుంది) 

6, అక్టోబర్ 2014, సోమవారం

V.I.P.opinions




 ముళ్ళపూడి రమణ గారు ఒకసారి రాసిన విషయం .ఆయన బాధపడినా ఏమీ అనలేక  ఉండిపోయినట్లు కనిపిస్తుంది.' బాలే 'లాగ తీసిన కళాఖండం  'సీతాకళ్యాణం '
  సినిమా ఇంగ్లాండు లో మంచి ప్రశంసలు పొందిన తర్వాత బాపు,రమణలు దాన్ని బిశ్వజిత్రాయ్ కి చూపించితే,అంతాచూసి  ఆ రోజుల్లో పెర్షియన్ కార్పెట్లు లేవు అనేసి  లేచి చక్కా వెళిపోయినట్లు రాసుకున్నారు.పాపం వీళ్ళు బాధ పడ్డా ఏమీ అనలేకపోయారు.ఆ పాయింటు మినహా మిగతా సినిమా అంతటిలోను,ఆయనకి బాగున్నవి ఒక్కటీ కనబడలేదా.ఇంగ్లండులో తనసినిమాలకన్నా గొప్ప ప్రశంసలు పొందినందుకు ఈర్ష్య అనుకోవాలా?ఒకోసారి గొప్పవాళ్ళు కూడా ఈర్ష్యా,అసూయలకి లోనవుతారనుకొంటాను.ఐనా రామాయణ  కాలంలో తివాసీలు లేవని ఆయన ఎలా అనుకున్నారు?రత్నకంబళ్ళు గురించి మన కావ్యాలనిండా వర్ణనలు   ఉన్నాయికదా.( తివాసీలు,పెర్షియాలోనేగాని మనదేశంలో  తయారయేవి కాదని అంటారు.పూర్వకాలం నుంచి పారసీక దేశానికి  చీనా దేశానికి,మన దేశానికి,వ్యాపారసంబంధాలు ఉండేవని చరిత్రలో తెలుస్తుంది.కాళిదాసు తన రఘువంశ ' కావ్యంలో శ్రీరామునికి పూర్వుడైన   రఘుమహారాజు పారశీకదేశంపై దండెత్తి జయించినట్లు రాశాడు. అందువల్ల ఎవరికైనా విమర్శించేముందు చాలా జాగ్రత్త అవసరమనుకొంటాను.  

4, అక్టోబర్ 2014, శనివారం

swatcha Bharat




 స్వచ్చ భారత్ కార్యక్రమాలు.ప్రముఖ నాయకులు,అధికారులు,చీపురుకట్టలతో చెత్త తుడవడం కొత్తకాదు.ఇదే మొదటి సారి కాదు.మరి ఎందుకు  విఫలమౌతున్నదో ప్రతిసారి అని ప్రశ్నించుకొంటే  కారణాలు తెలుస్తాయి.
   1.ఈ కార్యక్రమం కొన్నిసంవత్సరాలు  ఆగకుండా సాగాలి.
   2.సరియైన డ్రైనేజి  కల్పించాలి.
   3.మురుగునీరు ఆధునికపద్ధతిలో  ట్రీట్ చెయ్యకుండా జలాశయాల్లో కలపడాన్ని నిషేధించాలి.
   4.పై విధంగా చెయ్యాలంటే  తగిన నిధులు ఖర్చుపెట్టకుండా సాధ్యం కాదు.
   5.ఇంటింటికీ వెళ్ళి చెత్త కలెక్ట్ చేసి తగిన విధం గా దాన్ని డిస్పోజ్ చెయ్యాలి.అలాచెయ్య కుండా వీధుల్లో చెత్తపారబోసే వాళ్ళకి  జరిమానా విధించి తీరాలి.అంతేకాదు,అలా ఏర్పాటు చెయ్యని పంచాయితీ,మున్సిపాలిటీ  అధికారులపైన కూడా జరిమానా విధించాలి.
   6.ప్రతి ఇంటికి టాయిలెట్(పట్నాలు,పల్లెలు కూడా )ఉండితీరాలి.ఒకసంవత్సరం  గడువు ఇచ్చి ఆలోగా కట్టుకోకపోతే రూ.పదివేలు జరిమానా విధించాలి.మరీ పేదవారయితే ప్రభుత్వమే కట్టించి  ఇవ్వాలి.
    ఇంకా ఇలాంటి చర్యలు కఠినంగా తీసుకోకుండా అరుదుగా పెద్దలు చీపుర్లు పట్టుకుంటె ఏమీ లాభం ఉండదు.ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉంటుంది.

varma gari tactics




 రాంగోపాలవర్మ  గారి ఫాక్టరీ నుంచి తరచుగా సినిమాలు తయారవుతూ ఉంటాయి.ఇవి సాధ్యం ఐనంతవరకూ తక్కువ బడ్జెట్ లో తయారవుతాయి.మరి వాటికి కొంత పబ్లిసిటీ  అవసరం కదా!అందుచేత అందులో వివాదాస్పదమైన కథా,కొన్ని అంశాలు ప్రవేశ పెడతాడు. ఇక పైసా ఖర్చు లేకుండా దానిపై  మీడియాలో  విమర్శలు చెలరేగుతాయి.అందుకు జవాబుగా వర్మగారు నాఇష్టప్రకారం నేను సినిమా తీయడానికి నాకు స్వేచ్చ ఉంది  అంటారు.ఒకోసారి సెన్సారువారి అభ్యంతరాలు కూడా పబ్లిసిటీ కి తోడ్పడతాయి.సినిమా విడుదల ఐనతర్వాత,వ్యతిరేక ప్రదర్శనలు కూడా జరగవచ్చును.వీటన్నిటివలన,అ సిన్మా బాగులేక పోయనా కలెక్షన్లు వస్తాయి.
 అందువల్ల వర్మ సినిమా ని పట్టించుకోకుండా ignore చెయ్యడమే మంచిది.అందులో మన sensibilities కి అభ్యంతరకరమైనవి ఉన్నట్లు తెలిసినా.

14, సెప్టెంబర్ 2014, ఆదివారం

airports




 మన ఆం.ప్ర.ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో కొన్ని బాగానేఉన్నవి.ఆచరణకు పనికి వస్తాయి. కొన్ని మాత్రం ఆచరణసాధ్యం కానివి.అనవసరమైన ఖర్చుతోకూడినవి/అందులో ఒకటి.; ప్రతి జిల్లాలో విమానాశ్రయం నెలకొల్పడం.ఉదాహరణకి. శ్రీ కాకుళానికి,విజయనగరానికి విమానాశ్రయాలు. భొగాపురందగ్గర అన్నివసతులూ కూడిన పెద్ద విమానాశ్రయం  కడితే చాలును.మూడు   జిల్లాల  ప్రధానపట్టణాలకిబాగా అందుబాటులో ఉంటుంది.అదిచాలు.ఇప్పుడు ఉన్న విమానాశ్రయాల నిర్వహణలోనే  నష్టాలు వస్తున్నాయట.ఇంక ప్రతి చిన్న పట్టణంలోనూ ఒక airport ఎంత waste  ఆలోచించండి. 

3, సెప్టెంబర్ 2014, బుధవారం

name of new capital of A.P.




  కొత్త ఆంధ్రప్రదేశ్ రాజధాని నామకరణం గురించి వ్రాయదలిచాను.కొందరు దానిని N.T.R,నగర్ అని పేరు పెట్టమని సలహా ఇస్తున్నారు.కాని ఇది వాదవివాదాలకి ,కొంతమందికి అసంప్ తృప్తికి దారితీయగలదు.ఒక నాయకుడి పేరుపెట్టకుండా ,అందరికీ ఆమోద యోగ్యమైన నేను సూచించే  పేరుని అందరూ పరిశీలనలోకి తీసుకుంటే బాగుంటుందని కోరుతున్నాను.
   వందలసంవత్సరాలు ఆంధ్రదేశాన్ని అంతా పరిపాలించిన శాతవాహనచక్రవర్తుల రాజధాని ' అమరావతి ' .దానినే ' ఆంధ్రనగరి ' అనికూడా పిలిచేవారని చరిత్ర చెబుతున్నది.ఇంచుమించు ఆప్రాంతం లోనే రాజధానిని నెలకొల్పబోతున్నారు కాబట్టి కొత్త రాజధానిపేరు  '  అమరావతి '  అనికాని ' ఆంధ్రనగరి ' అనికాని  పెట్టితే బాగుంటుంది . నా అభిప్రాయంపై బ్లాగరు మిత్రుల చర్చను  ఆహ్వానిస్తున్నాను.

23, ఆగస్టు 2014, శనివారం

changing the names




  ఇప్పుడు,ఇందిర,రాజీవ్ ల పేరుతోఉన్న సంస్థలని,పథకాలని పేర్లు మార్చి N.T.R. పేరు పెడతామని తెలుగుదేశంప్రభుత్వం అంటున్నది.తెలుగుదేశంకాని.కాంగ్రెస్ కాని మరే పార్టీ కాని ఉన్నపేర్లు మార్చడానికి నేను వ్యతిరేకిస్తాను.అలాగే బ్రిటిష్ పరిపాలనలో,ముస్లిం పరిపాలనలో  పెట్టిన పేర్లు మార్చకూడదు.అవి మన చరిత్రలో భాగం.ఇంక విగ్రహాలు కూల్చడం మరీ అనాగరకం.కొత్తగా పథకాలు,సంస్థలు,బిల్డింగులు,నిర్మిస్తున్నారు.వాటికి మీకు ఇష్టమైన పేర్లు నిరభ్యంతరంగా  పెట్టుకోవచ్చును.ఇలాంటి విషయాల్లో విశాలదృక్పథం,సహనం ఉండాలి.                                   

16, జులై 2014, బుధవారం

NAALOE NEANU




 నా  మిత్రుడొకరు బి.రామలింగరాజు (సత్యం కంప్యూటర్స్ కి మాజీ అధినేత)రచించిన ''నాలో నేను ''అనే వచన కవితల పుస్తకాన్ని తెచ్చి యిచ్చారు.(ఎమెస్కో ప్రచురణ,జులై 2011) .ఆయన వ్యాపారాలు, క్రిమినల్ కేసులు ,వీటిని పక్కన పెట్టి చూస్తే,ఈ రచనల్లో కొంత భావుకత, తెలుగు భాషా పరిజ్ఞానం.తాత్వికదృష్టి  కనిపిస్తాయి.కొన్ని కవితలు బాగున్నవి.ఆలోచనల్ని రేకెత్తించేలా ఉన్నవి.కొన్ని సాదాసీదాగాఉన్నవి.ఉదాహరణకి నాకు నచ్చింది;; ' టికెట్టు లేని ప్రయాణికుడు ' అనే ఖండికలో --;;'' విధి అనే సామాన్లు మోస్తూ,గతి అనే స్టేషన్లో ఎక్కావీ రైలు,టికెట్టు  లేని ప్రయాణికుడివి నువ్వు,ఏ క్షణం లో నైనా టికెట్ కలెక్టర్ రావచ్చును,ఆ వచ్చేదే నీ ఆఖరు స్టేషను కావచ్చును. ' '; రామలింగరాజు ఇంకో  పార్శ్వం తెలుసుకోవాలనుకొన్నవాళ్ళు ఈ పుస్తకం చదవాలి.   

6, జూన్ 2014, శుక్రవారం

An appeal to Vizag youth.


 

  మన సీమాంధ్ర రాష్ట్రానికి విజయవాడ ప్రాంతంలో రాజధాని వచ్చే అవకాశాలు  ఎక్కువగా ఉన్నందున అప్పుడే అన్నీ అక్కడ కేంద్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఈ సందర్భంలో విశాఖపట్నాన్ని అశ్రద్ధచేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నవి.అందువలన ఒక వయోధికునిగా విశాఖ యువతకి విజ్ఞప్తి చేస్తున్నాను.ఈ కిందివాటికోసం వెంటనే వారు రోడ్లమీదకి వచ్చి శాంతియుతంగానే ప్రదర్శనలుచేసి సాధించుకోవలసి  ఉంటుంది. 1.కేంద్రీయ విశ్వవిద్యాలయం..2.I.I.M.3.I.I.T. నాకు వ్యాపారం,పరిశ్రమల గురించి   అంతగా తెలియదు.అందుచే వాటిగురించి తెలిసిన వారు  వ్రాయాలి.ఉత్తరాంధ్ర యువత వెంటనే (రాజ్యాంగబద్ధంగా) ఉద్యమించి కొత్త రాష్త్ర,కేంద్రప్రభుత్వాల పై ఒత్తిడి తీసుకురావాలి.

30, మార్చి 2014, ఆదివారం

greetings

sreejayanaamasamvatsara ugaadi vela andarikee naa subhaakaankshalu --kamaneeyam

20, మార్చి 2014, గురువారం

As long as there are suckers----


 

  ఈ మధ్య ఒక వార్త చదివాను.ఒక టీ.వీ.కళాకారిణి ఇతర టీ.వీ.ఉద్యోగులు చాలామంది దగ్గరనుంచి లక్షా,రెండులక్షలు చిట్స్ వసూలుచేసిందట.మొదట్లో అధికవడ్డీలు బాగానేఇచ్చిందట.ఒకరోజు 5 కోట్లు డబ్బుతో ఇల్లు ఖాళీ చేసి మాయమయిందట.చిట్లు కట్టినవాళంతా లబోదిబో మని పోలీసు స్టేషన్ కి పతిగెత్తారట.సూక్ష్మంగా సారాంశం ఇది.ఇటువంటి వార్త ఇప్పటికి దజనుసార్లేనా చూసి ఉంటాము.కొందరి అత్యాశని ఉపయోగించుకొని కొందరు మోసగాళ్ళు,మోసగత్తెలు ఇలా డబ్బుచేసుకొంటారు. కాని మళ్ళీ దురాశవల్ల,తెలివితక్కువవలన ప్రజలు మోసపోతూనేఉంటారు.అందుకేAs long as there are suckers ,there will be cheater s.అంటారు. 

19, ఫిబ్రవరి 2014, బుధవారం

payanam (Journey




 ఎచటికి నీ ప్రయాణం-ఏల యీ ప్రయాస?
 ఏది నీ గమ్యం-ఏమిటి నీ లక్ష్యం ?
 చెట్లు పుట్టలు దాటి-చిట్టడవులు దాటి
 కొండల్లో కోనల్లో -ఎండలలో వానలలో
 రాజమార్గంలో కొంత -రమ్యహర్మ్యాలలో కొన్నాళ్ళు
 ఆగుచూ,వెదకుచూ- అగమ్యమైన చోటికి
 ఎచటికి నీ ప్రయాణం-ఏల యీ ప్రయాస ?
 గమ్యంలేదు నా ప్రయాణానికి -కారణమేమో తెలియదు.
 పయనమే నా లక్ష్యం -ప్రయాసయే నా విధి.
 చీకటిలో ,చెలగే-  జిలుగు వెలుగులలో
              కష్టంలోను,సౌఖ్యం లోను,
 చివరి మజిలీ దాకా - చెప్పనలవికాని  నడకే
 జీవిత పరమార్థం ,వేరే లక్ష్యం -చివరి గమ్యం లేని ప్రయాణం
  మనకే తెలియదు మనమెందుకు పయనిస్తున్నామో
  మానవచరిత్ర  సమస్తం -మంచో చెడో పయనించడమే !    
                 -------------

8, ఫిబ్రవరి 2014, శనివారం

micro organisms




 ఇప్పుడు సైంటిస్టు కావాలంటే మంచి యూనివర్శిటీలో చదవాలి.మంచి లేబొరేటరీలో పరిశోధనలు చెయ్యాలి.ఖరీదైన పరికరాలు ,ఇతరుల సహకారం అవసరం.కాని మొదట్లో సామాన్యుడైనవ్యక్తి  తక్కువ పరిధిలో పరి శోధించి అపూర్వమైనవిషయాలు కనిపెట్టేవాడు.అలాంటివారిలో సమకాలికులైన 'లీవెన్ హోక్ '  (1632-1723) ,రాబర్ట్ హుక్ (1636-1703).ముఖ్యులు.16 వ శతాబ్దిలో జకారియా జాన్సెన్ అనే కంటి అద్దాలు తయారు  చేసే వ్యక్తి సూక్ష్మదర్శినిగా పనిచేసే అద్దాలను కనుగొన్నాడు.వాటిని అభివృద్ధి చేసి లీవెన్ హాఓక్  microscope  లను తయారుచేసి పరిశోధనలు చేసాడు.అతడు చిన్న వస్త్రవ్యాపారి.ఆ సూక్ష్మదర్శినులతో అతడు మొదట  నిర్జీవపదార్థాలని తర్వాత సజీవపదార్థాలను పరిశీలించడం    ప్రారంభించాడు. నీటిని,రక్తాన్ని,చర్మాన్ని,తన వీర్యాన్ని,ఉమ్మిని పరీక్షించాడు.ఆస్చర్యకరంగా వాటిలో వేలకొద్ది సజీవ సూక్ష్మ జీవులు కనిపించాయి.తన పరిశీలనాఫలితాలని ప్రచురించాడు.మొదట్లో ఇతర శాస్త్రజ్ఞులు  నమ్మలేదు. తర్వాత అతని అహ్వానంతో స్వయంగా చూసి నమ్మారు.లండన్లోని రాయల్ సొసైటీ (Royal society of sciences ) అతనిని గౌరవించి,అతని పరిశోధనలని ప్రచురించేది.
   రాబర్ట్ హుక్ గొప్ప సైంటిస్టు. ఎన్నో విషయాలు కనిపెట్టాడు.అతడు రచించిన మైక్రోగ్రాఫియా (micrograaphia) అనేగ్రంథం ప్రసిద్ధం ఐనది.దేహనిర్మాణం లో మూలమైన జీవకణాన్ని(cell) ని కనుగొని వర్ణించాడు. వీరిద్దరి కృషి ఫలితంగా వైద్యం,(Medicine ) , Biology)  జీవశాస్త్రం ల అభివృద్ధి కి ఎంతగానో తోడ్పడినవి.  

31, జనవరి 2014, శుక్రవారం

VESALIUS -CONTD.

THE full name of the book of Anatomy by Andreasvesalius is 'de humanis corporis fabrica ' and 'tabulea 'are parts of the book.This point may kindly be noted.

Andreas Vesalius (1514-1564)




 మానవుడికి తన శరీరం కన్నా సన్నిహితమైనది,కావలసినది మరొకటి లేదు కదా!ఐనా తన శరీర నిర్మాణం గురించి తెలుసుకోడానికి మానవునికి చాలా శతాబ్దాలకాలం పట్టింది.క్రీ.శ.2వ శతాబ్దంలో రోమన్ వైద్యుడు గాలెన్,(Galen) రచించిన గ్రంథమొక్కటే ,తప్పులున్నా ,అసంపూర్ణమైనా ప్రామాణికంగా ఉండేది.16వ శతాబ్దంలో వెసాలియస్ (AndreasVesalius ) స్వయంగా ఎన్నో శవాలని కోసి వివరించేదాకా విద్యార్థులకు,వైద్యులకు శరీరనిర్మాణం గురించి సరిగా తెలియదు.వెసాలియస్ బెల్జియం దేశస్తుడు.చాలాచోట్ల పనిచేసి చివరకు ఫ్రెంచ్ రాజు దగ్గర ఆస్థానవైద్యుడుగా ఉండేవాడు.1538లో అతడు 200 చిత్రాలతో 800 పేజీల మహా గ్రంథాన్ని రచించాడు. TABULEA ANATOMICAE దానిపేరు.అస్తిపంజరనిర్మాణం,గుండె,రక్తనాళాల వివరాలతో ఈ గ్రంథం తరవాతి తరాలవారికి చాలా కాలం ఉపయోగపడినది.ఆధునిక వైద్యశాస్త్రానికి మూలస్తంభాలలో వెసాలియస్ కృషి ఒకటిగా పేర్కొనవచ్చును.

27, జనవరి 2014, సోమవారం

60 years of Indepedence -an assessment




  మన దేశం స్వతత్రమై 66ఏళ్ళు ,మొదటి గణతంత్రదినోత్సవం 63 ఏళ్ళు ఐనవి.ఈ సందర్భంలో  మనదేశం సాధించినదేమిటి   అని తర్కించుకోవాలి.ప్రభుత్వాలు,పార్టీలు,ప్రజలు అని కాకుండా మన జాతిమొత్తం సాధించినది బేరీజు వేసుకుంటే క్లుప్తంగా నాకు తోచినది రాస్తాను.అమెరికాలోఉన్న నా మిత్రులు ఇండియా  బాగా మారిపోయింది,అని అంటారు.ప్రభుత్వ,ప్రైవేటు సంస్థల రిపోర్టుల ఆధారంగాను,మనం ప్రత్యక్షంగా  చూస్తున్న దాని ప్రకారము ఈ విషయాలు రాస్తున్నాను.
  1,వ్యవసాయరంగం ;- 3రెట్లు జనాభా పెరిగినా 5 రెట్లు వ్యవసాయౌత్పత్తులు పెరిగి కరువుకాటకలని నివారించాము.
  2.పారిశ్రామిక రంగం;- తాతా  ఉక్కుఫాక్టరీ తప్ప మరి పెద్ద పరిశ్రమలు లేని పరిస్థితి నుంచి ప్రపంచంలో ఒక  పెద్ద పారిశ్రామిక దేశాల్లో మనదేశం ఒకటైనది.
  3.అణుశక్తి,అంతరిక్షయానం ,వీటిలో 6అగ్రగామి దేశాల్లో ఒకటి ఐనాము.
  4.విద్య;-100కి 10 మంది విద్యావంతులున్న   స్థితినుంచి 100కి70 మంది చదువుకున్నవారి గా    అభివృద్ధి సాధించాము.ఉన్నతవిద్య, సాంకేతిక విద్య లో బాగా అభివృద్ధి  సాధించాము.information technology లో అగ్రస్థానంలో ఉన్నాము.
  5.వైద్యం,ఆరోగ్యం;- మశూచి ,ప్లేగు,కలరా,కుష్ఠు ,పోలియో  వంటి అంటురోగాల్ని నిర్మూలించగలిగాము.సగటు ఆయుప్రమాణం 30 సం;నుంచి దాదాపు 70 సం; కి పెరిగింది.
  6.జీవనవ్యయం బాగా పెరిగినా సగటు ఆదాయం కూదా అంతకన్నా పెరిగింది.ప్రజల జీవనప్రమాణాలు ,శైలి కూడా వృద్ధిపొందింది.
  7.infrastructure ,రోడ్లు,విద్యుత్ ఉత్పత్తి అందరికీ అందుబాటులో కి వచ్చాయి.
  8.అప్పటిలో 100కి 80 మంది దారిద్ర్యరేఖకు   దిగువలో ఉండేవారు.నేడు100కి 30మంది పేదరికంలో(3రెట్లు జనాభా పెరిగినా)ఉన్నారు.
  పై అంశాలని బట్టి మనం ఒకదేశంగా పాక్షికవిజయాల్నిమాత్రమే సాధించామని ఇంక చాలా కృషి చెయ్యాలని.సరి ఐన విధానాలతో ప్రభుత్వాలు (కేంద్ర,రాస్ట్రప్రభుత్వాలు) అన్నివర్గాల ప్రజలూ,పట్టుదలతో పనిచేస్తే,వచ్చే 20,లేక 30 సంవత్సరాలలో పూర్తి అభివృద్ధి  సాధించి ప్రపంచంలోని నాలుగు లేక ఐదు అగ్రరాజ్యాల్లో ఒకటిగా విలసిల్లుతామని  భావిస్తున్నాను.      

20, జనవరి 2014, సోమవారం

Sasi tharoor



 

  శశిథరూర్ (కేంద్ర సహాయమంత్రి)భార్య సునందాపుష్కర్ ఆత్మహత్య గురించి నిజానిజాలు ఏమైనా,పాకిస్తాన్ జర్నలిస్టు తో అతని సంబంధం గురించి నిజానిజాలు ఎలా ఉన్నా ,ఈ scandalవలన థరూర్ వెంటనే  మంత్రిపదవికి రాజీనామా చేయవలసిన నైతిక బాధ్యత ఉంది.అలా చేయకపోతే ప్రధానమంత్రి అతనిని తొలగించాలి.  

9, జనవరి 2014, గురువారం

aggipeTTelu




 ఇటీవల రైళ్ళలో అగ్నిప్రమాదాలు,బోగీలు మొత్తం కాలిపోయి ప్రయాణీకులుచనిపోవడం చూస్తున్నాము.ఎప్పుడో చాలా అరుదుగా జరుగుతే ఏమో కాని A.C.కంపార్ట్ మెంట్లు అగ్గిపెట్టెలై వాటిలో ప్రయాణం చేయడానికి భయం వేస్తున్నది.ఇంతజరుగుతున్నా రైల్వే శాఖ,ప్రభుత్వం స్పందించడంలేదు.నేను ఈ కింది సూచనలు వెంటనే అమలుజరుపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.1.ఒక నెల రోజులు A.C.సౌకర్యం ఆపివేయాలి.2.ఆ వ్యవధిలో అన్ని ఏ.సి.సిస్టెంస్ ని క్షుణ్ణంగా చెక్ చేసి లోపాలు సవరించాలి.3.అన్ని ఏ.సి.బోగీలకి emergency exits ఏర్పాటు చెయ్యలి.4.డ్రైవర్ కి రైలులో ఎక్కడ మంటలు రేగినా తెలిసే పద్ధతి ఏర్పాటు చెయ్యాలి.ఈ చర్యలు ఆలస్యం లేకుండా చేపట్టాలి.వీటిని A.C. బస్సులకి కూడా వర్తింపజేయాలి. 

6, జనవరి 2014, సోమవారం

tragedies in cine life.



 

 సినిమా నటుడు ఉదయకిరణ్ ఆత్మహత్య ఉదంతం చాలా బాధ కలిగించింది.పైకి ఎంతో గ్లామరస్ గా సంపన్నంగా కనబడే సినిమా ప్రపంచంలో ఎంతోకొంత ప్రాముఖ్యం సంపాదించుకున్న కొందరి జీవితాల్లో ట్రాజెడీలు  మనకు తెలిసిందే.చివరిదాకా ఆనందంగా,దర్జాగా బతికిన వారి సంఖ్య తక్కువే.ప్రముఖులసంగతే ఇలావుంటే ,చిన్నచిన్న వేషాలు వేసేవాళ్ళు,డాన్సర్లు,మొదలైనవాళ్ళ జీవితాల్లో ఎంత ట్రాజెడీలు దాగివున్నాయో కదా!