బుధవారం 15 ఫిబ్రవరి 2012

chaina




 జాన్ కే అనే రచయిత చాలా పరిశోధించి రాసిన 'china-a history అనే గ్రంథాన్ని చదువుతున్నాను.అగ్రరాజ్యంగా వేగంగా ఎదుగుతున్న చైనా గురించి తెలుసుకోవాలంటే దాని ప్రాచీన చరిత్ర కూడా తెలుసుకోవాలని రచయిత అంటాడు .చాలా క్లుప్తంగా వివరిస్తాను.
 1.బి.సి.2000సం. పూర్వం మన షట్ చక్రవర్తులలాగే వాళ్ళు 5 గురు చక్రవర్తులు పాలించారని నమ్ముతారు.
 2.చారిత్రక కాలానికి వస్తే దాదాపు బి.సి.2000 నుంచి బి.సి.250 వరకు మూడు రాజవంశాలు పాలించినట్లు  ఆధారాలు ఉన్నాయి.ఐతే వీరిని రాజులుగానే గుర్తించారు.కారణం; వారు హొయాంగ్ హో ( yellow river ) పరీవాహక ప్రాంతాన్ని మాత్రమే పాలించారు.1.క్సియా (xia) వంశం బి.సి.2070 - బి.సి.1600 వరకు.2.షాంగ్ (shang) వంశం బి.సి.1600 - 1050 బి.సి.వరకు.3.ఝౌ ( zhou) వంశం బి.సి.1050- 256 బి.సి.వరకు పాలించాయి.వీరి గురించి సమాచారం ,ఎముకలు,వెదురుదబ్బలు ,కంచు పాత్రలపై చెక్కిన లిపులచేతను ,కొన్ని సమాధులలో లభ్యమైన అవశేషాల ద్వారా
 లభ్యమైనది.ఇవి కాక దక్షిణాన 'చు ' (chu) అనే రాజ్యం ,ఇంకా   కలహించుకొంటూ ఉండే చిన్న రాజ్యాలు కొన్ని ఉండేవి.(warring states)
  చైనా  వారికి మన లాగ మతాలు,వేదాంతాలు లేవు.వారికి కొన్ని నమ్మకాలు ఉండేవి.పిత్రుదేవతల ఆరాధన ముఖ్యం.(ancestor worship) బి.సి.6,5,శతాబ్దుల్లో కంఫుషస్   (confushiyas) ,లాత్సె (Laotse) ,మెంజి (mencius) అనే తత్వవేత్తలు  నీతిసూత్రాలు,సమాజనియమాలు,ప్రవర్తనావళి ,రచించారు.బోధించారు.వారి కాలంలో ప్రసిద్ధి కాంచకపోయినా ,తర్వాత కాలంలోను, ఈనాటికి కూడా చైనీయ సమాజానికి మార్గదర్శకంగా ఉన్నాయి.
 క్రీ.పూ.256 లో చైనాలో మొదటి సామ్రాజ్యం స్థాపించబడి చైనాలో అత్యధిక భాగం తన ఏలుబడి లోకి తెచ్చుకున్నది.ఈ వంశం పేరు క్విన్ లేక చిన్ .ఇతడు తనని చక్రవర్తిగా ప్రకటించుకొన్నాడు.(huyangDi).తర్వాతి చరిత్ర మరొకమారు తెలియజేస్తాను    చైనా చరిత్ర మనకెందుకు అని చాలా మంది అనుకోవచ్చును.కాని ఈ క్రింది కారణాలవలన అది మనకు ముఖ్యం.
  1.టిబెట్ని ఆక్రమించుకోడం చేత చైనా మనకు పొరుగు దేశం ఐనది మనకు,వాళ్ళకు సరిహద్దు తగాదాలు ఉన్నవి.2.1962 లో  మనపై దండయాత్ర చేసి ఆక్సాఇచిన్ ప్రాంతం ఆక్రమించింది.అరుణాచల్ తనదే అంటున్నది.3.మనకు విరోధి ఐన పాకీస్తాన్ కు బలమైన సప్పోర్టు ఇస్తూ ఉంటుంది.4.మనం కూడా క్రమంగా అగ్రరాజ్యంగా ఎదుగుతున్నాము.అందుచేత భారత్,చైనాలు అనేక రంగాల్లో పోటీ పడే అవకాశం ఉంది.5.మనదేశంలో చైనా అనుకూల  వర్గాలు,లాబీలు ఉన్నాయి.అవి మన దేశంలో అస్థిరత్వం కలిగించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి.
      -----------------------------
          

బుధవారం 8 ఫిబ్రవరి 2012

known already


  1.
 మా అబ్బాయి అప్పుడప్పుడూ ఫోన్ చేసి కొత్త విషయాలని చెప్పుతూ ఉంటాడు.సైన్సు సంగతులు వదిలేస్తే ,మేనేజ్మెంట్,పరిపాలన,మానవసంబంధాలు, నీతిసూక్తులు,వ్యాపార సూత్రాలు మొ;వాటి గురించి చెప్పినప్పుడు ,నేను ఇవన్నీ వేమన పద్యాల్లో ,సుమతీ శతకంలో ,భర్తృహరి సుభాషితాల్లో,మహాభారతంలో,భగవద్గీతలో,లేక కంఫూషస్ సూత్రాల్లోనో ఉన్నాయని చెప్పేసరికి ,మీరు అగ్నిహొత్రావధానులు లాగ 'అన్నీ మన వేదాల్లో ఉన్నాయష 'అన్నట్టు మాట్లాడతారని విసుక్కొంటాడు.అవును,మరి ఇవన్నీ పూర్వులు ఎవరో, ఎప్పుడో చెప్పినవే అంటాను.
 2.ఈ మధ్య హొయసాల శిల్పాల ఫొటోలతో ఒకరు బ్లాగు రాశారు .అందులో వరాహావతారంలో విష్ణుమూర్తి భూమిని పైకెత్తినట్లు చూపిస్తూ మామూలుగా చెక్కే స్త్రీమూర్తిగా కాకుండా గోళంలాగ ( globe ) చెక్కేరు.ఆశిల్పాలు 13వ శతాబ్దమ్నాటివి.  యూరప్లో భూమి గుండ్రంగా ఉందని 15వ శతాబ్దందాకా తెలియదు.బల్లపరుపుగా ఉందని అనుకొనే వాళ్ళు.కపిత్థాకారం భూగోళం అని మనవాళ్ళు   ఎప్పుడో చెప్పారు.( కపిత్థం అంటే వెలగపండు అని అర్థం ) .
 రచన పత్రికలో  చిట్టెన్రాజుగారి  జోకులతో ముగిస్తాను.ఆయనే చెప్పినట్లు జోకులమీద అందరికీ 'కాపీ రైటు ' ఉందికదా.
  1.మొగుడూ, పెళ్ళం, ఒకే నాణేనికి రెండు పక్కలే,ఎందుకంటే  పెళ్ళయ్యాక కొన్నాళ్ళకి ఒకరిమొహం మరొహరు చూసుకోలేరు కాబట్టి!
  2.ఒక ఫిలాసఫర్ యువకుడికి ఇచ్చిన సలహా ' తప్పకుండా  పెళ్ళి చేసుకో .మంచి పెళ్ళాం వస్తే జీవితాంతం ఆనందిస్తావు. లేకపోతే నాలాగ ఫిలాసఫర్వి అవుతావు.
  3.డాక్టర్ పేషెంటుతో 'ఈ రెండు మాత్రలు తీసుకొని రాత్రి ఒకటి వేసుకొండి .పొద్దున్న లేస్తే రెండో మాత్ర వేసుకొండి!

      -------------------------------     

ఆదివారం 22 జనవరి 2012

sooktulu


 

 1. కులమనుట చాల తప్పది
    వలవదు ,దానిని సమాజ వర్గంబనుచున్
    పిలుచుటయే సరియైనది
    తెలియుమ, కులరహిత భరత దేశంబందున్.
             ----------
 2. ప్రతి పక్షమ్ముల దిట్టుట
    యతిసహజమ్మె యధికార మందెడివరకున్
    మితిమీరి స్వపక్షమునే
    కతిపయదినముల ను దూరగా దగు నేడున్ .
             -------------
 3. నీవే పక్షమ్మైనను
    నీ వారలు కొందరెదిరి నిలువగ దగుగా
    శ్రీవారి పనులు తీర్చగ
    నేవాదమ్ము గెలిచినను నీకే మేలౌ  
              -------------- 

శుక్రవారం 20 జనవరి 2012

roots.contd.




 తిరుగు ప్రయాణం విజయనగరం మీదుగా.అక్కడ కొంచెం సేపు ఆగాము.అప్పటికే చీకటి పడింది.సెలవురోజు.ఇంతకు ముందు చూసిందే ఐనా మా వాళ్ళు కోసం కోట చూడ్డానికి వెళ్ళాము.గేట్లు మూసివున్నాయి.వాచ్మన్ ట్రాప్ డోర్ ద్వారా లోపలికి తీసుకు  వెళ్ళాడు.కోటని కా లేజికి ఇచ్చేసారు.సెలవురోజు, రాత్రి, గదులన్నీ మూసివున్నాయి. పైనుంచే చూసాము.కోట ఆవరణ చాలా పెద్దది.బిల్డింగులు కూడా పెద్దవీ ,మూడు అంతస్తుల్లో ఉన్నవి.కోట ప్రహరీ గోడ ఎత్తుగా రెండు కిలోమీటర్లు ఉంటుంది.కోట శిథిలం కాలేదు .బాగానే ఉంది.కాని చుట్టూ ఉన్న కందకం పూడ్చేసి గోడ దా కా ఏవో ఇళ్ళూ, దుకాణాలూ కట్టడం వలన బయట నుంచి కోట బాగా కనబడలేదు. ముఖద్వారం ఎదురుగా మాత్రం ఖాళీగా ఉంది.కన్యాశుల్కం ఫేం బొంకులదిబ్బ  లేదు.గంటస్తంభం (ఒక landmark )ఉంది.పెద్దచెరువు చుట్టూ చెట్లు పెంచారు.గట్టు మీద రాజుల విగ్రహాలు  ప్రతిష్ఠించారు.అన్నట్టు పీ.వీ.జీ.రాజుగారి విగ్రహమూ,ఒకప్పటి రాణి వాసం భవనాలూ కోటలోనే ఉన్న వి చూసాము.విజయనగరం చాలాకాలం    దాకా,పాతగా, అభివృద్ధి లేకుండా ఉండేది.కాని ఇటీవల ,ముఖ్యంగా రైల్వే స్టేషన్ వైపు  పెద్దరోడ్లు,మేడలు,ఆఫీసులు,హోటల్సు, కాలనీలు బాగా అభివృద్ధి చెందాయి.     గురజాడవారి ఇల్లు కూడా చూసాము.మంచి స్థితి లోనే ఉంది.మీరెవరైనా ఉత్తరాంధ్రకి వస్తే వైజాగ్ మాత్రమే కాక విజయనగరం కూడా చూడండి. ఒక శోచనీయమైన విష యమేమంటే అప్పటి కత్తులూ కటార్లూ కవచాలు దుస్తులూ ఇతర వస్తువులు  చాలా వరకూ విశాఖపట్నం,హైద్రాబాద్  వంటి చోట్లకి మ్యూజియంస్ కి తరలించేసార ట.  
  

బుధవారం 18 జనవరి 2012

sandeham.




  ఒక సందేహం;వాల్మీకి  రామాయణం,వ్యాసభారతం ,పూర్తిగా తెలుగులో చదివాను.కాని అందులో ఎక్కడా వ్రాత writingఉన్నట్లు దాఖలా లేదు.ఒకరు ఇంకొకరికి కబురు పెట్టినా ,రాయబారం పంపినా 'నా మాటగా ఇలా చెప్పు 'అని మాటలతోనే సందేశం పంపే వారు కాని లేఖలు రాసినట్లు నిదర్శనాలు లేవు.ఆ కాలం లో వ్రాత లిపి ఉండేదా ?మొదటి సారిగా మనకు అశోకుడి శాసనాల్లో నే వ్రాత ( బ్రాహ్మీ లిపి అనుకొంటాను.క్రీ.పూ.300 ) సింధు నాగరకతా శిథిలాల్లో ముద్రల పై లిపి కనిపిస్తుంది.కాని అది ఆర్యనాగరకత కాదు ,ద్రావిడ లేక దస్య నాగరకత అంటారు.( క్రీ.పూ.2500 )ఈ విషయానికి మన పండితులు ,పౌరాణికులు సమాధానం చెప్పలేరు.చరిత్ర పరిశోధకులు కాని,వారిని బాగా చదివినవారే చెప్పగలరు.మన  బ్లాగు మిత్రులెవరైనా తెలిసినవారుంటే విశదీకరిస్తే సంతోషిస్తాను.--రమణారావు.  

ఆదివారం 15 జనవరి 2012

roots

  

 మాది మొదట చామలాపల్లి అనే పల్లె,అగ్రహారం.మా తాతగారి కాలం లోనే దాన్ని విడిచి వైజాగ్లో సెటిలయ్యారు.మా భూములు 'జమిందారీ ,ఇనాందారీ, రద్దు చట్టం క్రింద 'స్వరాజ్యం వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని రైతులకు పంచి పెట్టింది.ఒక తోట ,ఇల్లు మిగిలి ఉంటే మా నాన్నగారు అమ్మేసారు.అందువలన ఆ వూరి మీద ఆసక్తి లేక జీవితంలో ఎన్నడూ వెళ్ళి చూడలేదు.ఇన్నాళ్ళకి చాలా అలస్యంగా ఎందుకో బుద్ధి పుట్టి ,మా అబ్బాయి,మనమడు,మనమరాలుతో మా కారులో వెళ్ళాము.శ్రీకాకుళం నుంచి రమారమి 100  కి.మీ.దూరం.విజయనగరం నుంచియస్. .కోట కి వెళ్ళే దారిలో ఉంది,సంక్రాంతి రోజులు కాబట్టి చల్లగా,దారి పొడుగునా పచ్చగా మనోహరంగా ఉంది.ఊరి చుట్టూ కూడా పొలాలు,చెట్లు,తోటలు ఉన్నాయి.గోస్తని యేరు దగ్గరే. తాటిపూడి రిజర్వాయర్ కొంచెం దూరంలో ఉంది.మరికొంత దూరంలో తూర్పు కనుమలు.
    ఊళ్ళో బ్రాహ్మణ వీధిలో 50-60 గడపలు ఉన్నాయి.కాని చాలావరకు ఖాళీ.విజయనగరం,విశాఖపట్నం,హైద్రాబాద్, అమెరికాలలో వున్నారట.ఉన్న కొద్దిమందీంధువుల్ని కలిసాము.ఊరిదాకా మంచి తారురోడ్డు ఉంది.ఊళ్ళో సిమెంటు రోడ్లు ఉన్నాయి.కరెంటు ఉండటం వల్ల అందరి యిళ్ళలో విద్యుత్ దీపాలు,పంకాలు,ఫ్రిజ్లూ ,ఫోన్లూ ఉన్నాయి,కొంతమందికి కార్లు,ఏ.సీ.లు ,మోటారు సైకిళ్ళు ఉన్నవి.ఊర్లోనే ఒక స్కూలు కూడా ఉంది.
  రైతుల ఇళ్ళు కూడా 100 గడపల దాకా ఉన్నాయి.పూరిళ్ళు దాదాపు మాయం ఔతున్నవి.సిమెంటు ,ఇటుకల తో కట్టిన డాబా ఇళ్ళు ఎక్కువగా ఉన్నాయి.ట్రాక్టర్లు ,మోటారు పంపులూ వాడుతున్నారు. ఊళ్ళో మంచి నీటి కొళాయిలు కూడా ఉన్నాయి.
  బ్రాహ్మల ఇళ్ళు మాత్రం పాతవే ఉన్నా గట్టిగానే ఉన్నాయి.ఇటుకలు,మట్టితో నిర్మించారు.కొన్ని పెంకుటిళ్ళు,కొన్ని డాబా యిళ్ళు.to be continued.      

state policy.


 

 15-1-12 ఈనాడు పత్రికలో గురుచరణ్దాస్ అనే ప్రసిద్ధ జర్నలిస్టు రాసిన వ్యాసం తెలుగు అనువాదం నాకు నచ్చింది.దానిలోని అంశాలు క్లుప్తంగా ఇస్తున్నాను.
 1.మనదేశం చరిత్రలో ఎప్పుడూ సంపన్న మైనదే ఐనా ,చిన్నరాజ్యాలు ,అంతహ్కలహాలవల్ల పతనమయ్యేది.సామ్రాజ్యాలు పెద్దవి ఏర్పడినా అవికూడా పరిపాలనా రీత్యా బలహీనమైనవే.
 2.బ్రిటిష్ వాళ్ళు బలమైన పరిపాలనా యంత్రాంగం, సుశిక్షిత మిలిటరీ, న్యాయ వ్యవస్థను ఇచ్చి వెళ్ళి పోయారు.
 3.మనరాజ్యం ప్రభుత్వం కన్నా మన సమాజం,సంస్కృతీ బలమైనవి.
 4.మనదేశం గణనీయమైన అభివృద్ధి సాధించినా ,మనప్రధాన లోపం బలహీనమైన రాజ్యం (state) నిర్ణయాలు తీసుకోడంలో విపరీతమైన జాప్యం.ఆచరణలో కూడా విపరీతమైన అలసత్వం.
 5.బలమైన కేంద్ర,రాష్త్ర ప్రభుత్వాలు అవసరం.
 6.అలా అని నియంతృత్వం మంచిది కాదు.
 7.ప్రజాస్వామిక ప్రభుత్వమే బలంగాను,కఠినం గాను ఉండాలి.ఉదారంగాను, క్షెమంకరంగాను ఉండాలి.కోర్టులు కూడా అలాగే ఉండాలి. ఒక మాటలో  చెప్పాలంటే 'దుష్ట శిక్షణ ,శిష్ట  రక్షణ' చెయ్యాలి.
 8.రాజకీయ జోక్యం, అవినీతిని సహించకూడదు.పై సిద్ధాంతాలు పాటిస్తే ప్రజాస్వామికంగానే మనం సత్వర పురోభివృద్ధి సాధించగలము.
   మొత్తం మీద గురుచరణ్ దాసు చెప్పేదేమంటే ప్రజాస్వామిక మంటే అరాచకమూ,క్రమశిక్షణా రాహిత్యమూ కాదు.పాశ్చాత్యదెశాల వలెనే వ్యక్తిస్వేచ్చతో బాటు క్రమశిక్షణా,  రూల్స్ ని కఠినంగా  పాటించడం కూడా.