22, జనవరి 2012, ఆదివారం

sooktulu


 

 1. కులమనుట చాల తప్పది
    వలవదు ,దానిని సమాజ వర్గంబనుచున్
    పిలుచుటయే సరియైనది
    తెలియుమ, కులరహిత భరత దేశంబందున్.
             ----------
 2. ప్రతి పక్షమ్ముల దిట్టుట
    యతిసహజమ్మె యధికార మందెడివరకున్
    మితిమీరి స్వపక్షమునే
    కతిపయదినముల ను దూరగా దగు నేడున్ .
             -------------
 3. నీవే పక్షమ్మైనను
    నీ వారలు కొందరెదిరి నిలువగ దగుగా
    శ్రీవారి పనులు తీర్చగ
    నేవాదమ్ము గెలిచినను నీకే మేలౌ  
              -------------- 

20, జనవరి 2012, శుక్రవారం

roots.contd.




 తిరుగు ప్రయాణం విజయనగరం మీదుగా.అక్కడ కొంచెం సేపు ఆగాము.అప్పటికే చీకటి పడింది.సెలవురోజు.ఇంతకు ముందు చూసిందే ఐనా మా వాళ్ళు కోసం కోట చూడ్డానికి వెళ్ళాము.గేట్లు మూసివున్నాయి.వాచ్మన్ ట్రాప్ డోర్ ద్వారా లోపలికి తీసుకు  వెళ్ళాడు.కోటని కా లేజికి ఇచ్చేసారు.సెలవురోజు, రాత్రి, గదులన్నీ మూసివున్నాయి. పైనుంచే చూసాము.కోట ఆవరణ చాలా పెద్దది.బిల్డింగులు కూడా పెద్దవీ ,మూడు అంతస్తుల్లో ఉన్నవి.కోట ప్రహరీ గోడ ఎత్తుగా రెండు కిలోమీటర్లు ఉంటుంది.కోట శిథిలం కాలేదు .బాగానే ఉంది.కాని చుట్టూ ఉన్న కందకం పూడ్చేసి గోడ దా కా ఏవో ఇళ్ళూ, దుకాణాలూ కట్టడం వలన బయట నుంచి కోట బాగా కనబడలేదు. ముఖద్వారం ఎదురుగా మాత్రం ఖాళీగా ఉంది.కన్యాశుల్కం ఫేం బొంకులదిబ్బ  లేదు.గంటస్తంభం (ఒక landmark )ఉంది.పెద్దచెరువు చుట్టూ చెట్లు పెంచారు.గట్టు మీద రాజుల విగ్రహాలు  ప్రతిష్ఠించారు.అన్నట్టు పీ.వీ.జీ.రాజుగారి విగ్రహమూ,ఒకప్పటి రాణి వాసం భవనాలూ కోటలోనే ఉన్న వి చూసాము.విజయనగరం చాలాకాలం    దాకా,పాతగా, అభివృద్ధి లేకుండా ఉండేది.కాని ఇటీవల ,ముఖ్యంగా రైల్వే స్టేషన్ వైపు  పెద్దరోడ్లు,మేడలు,ఆఫీసులు,హోటల్సు, కాలనీలు బాగా అభివృద్ధి చెందాయి.     గురజాడవారి ఇల్లు కూడా చూసాము.మంచి స్థితి లోనే ఉంది.మీరెవరైనా ఉత్తరాంధ్రకి వస్తే వైజాగ్ మాత్రమే కాక విజయనగరం కూడా చూడండి. ఒక శోచనీయమైన విష యమేమంటే అప్పటి కత్తులూ కటార్లూ కవచాలు దుస్తులూ ఇతర వస్తువులు  చాలా వరకూ విశాఖపట్నం,హైద్రాబాద్  వంటి చోట్లకి మ్యూజియంస్ కి తరలించేసార ట.  
  

18, జనవరి 2012, బుధవారం

sandeham.




  ఒక సందేహం;వాల్మీకి  రామాయణం,వ్యాసభారతం ,పూర్తిగా తెలుగులో చదివాను.కాని అందులో ఎక్కడా వ్రాత writingఉన్నట్లు దాఖలా లేదు.ఒకరు ఇంకొకరికి కబురు పెట్టినా ,రాయబారం పంపినా 'నా మాటగా ఇలా చెప్పు 'అని మాటలతోనే సందేశం పంపే వారు కాని లేఖలు రాసినట్లు నిదర్శనాలు లేవు.ఆ కాలం లో వ్రాత లిపి ఉండేదా ?మొదటి సారిగా మనకు అశోకుడి శాసనాల్లో నే వ్రాత ( బ్రాహ్మీ లిపి అనుకొంటాను.క్రీ.పూ.300 ) సింధు నాగరకతా శిథిలాల్లో ముద్రల పై లిపి కనిపిస్తుంది.కాని అది ఆర్యనాగరకత కాదు ,ద్రావిడ లేక దస్య నాగరకత అంటారు.( క్రీ.పూ.2500 )ఈ విషయానికి మన పండితులు ,పౌరాణికులు సమాధానం చెప్పలేరు.చరిత్ర పరిశోధకులు కాని,వారిని బాగా చదివినవారే చెప్పగలరు.మన  బ్లాగు మిత్రులెవరైనా తెలిసినవారుంటే విశదీకరిస్తే సంతోషిస్తాను.--రమణారావు.  

15, జనవరి 2012, ఆదివారం

roots

  

 మాది మొదట చామలాపల్లి అనే పల్లె,అగ్రహారం.మా తాతగారి కాలం లోనే దాన్ని విడిచి వైజాగ్లో సెటిలయ్యారు.మా భూములు 'జమిందారీ ,ఇనాందారీ, రద్దు చట్టం క్రింద 'స్వరాజ్యం వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని రైతులకు పంచి పెట్టింది.ఒక తోట ,ఇల్లు మిగిలి ఉంటే మా నాన్నగారు అమ్మేసారు.అందువలన ఆ వూరి మీద ఆసక్తి లేక జీవితంలో ఎన్నడూ వెళ్ళి చూడలేదు.ఇన్నాళ్ళకి చాలా అలస్యంగా ఎందుకో బుద్ధి పుట్టి ,మా అబ్బాయి,మనమడు,మనమరాలుతో మా కారులో వెళ్ళాము.శ్రీకాకుళం నుంచి రమారమి 100  కి.మీ.దూరం.విజయనగరం నుంచియస్. .కోట కి వెళ్ళే దారిలో ఉంది,సంక్రాంతి రోజులు కాబట్టి చల్లగా,దారి పొడుగునా పచ్చగా మనోహరంగా ఉంది.ఊరి చుట్టూ కూడా పొలాలు,చెట్లు,తోటలు ఉన్నాయి.గోస్తని యేరు దగ్గరే. తాటిపూడి రిజర్వాయర్ కొంచెం దూరంలో ఉంది.మరికొంత దూరంలో తూర్పు కనుమలు.
    ఊళ్ళో బ్రాహ్మణ వీధిలో 50-60 గడపలు ఉన్నాయి.కాని చాలావరకు ఖాళీ.విజయనగరం,విశాఖపట్నం,హైద్రాబాద్, అమెరికాలలో వున్నారట.ఉన్న కొద్దిమందీంధువుల్ని కలిసాము.ఊరిదాకా మంచి తారురోడ్డు ఉంది.ఊళ్ళో సిమెంటు రోడ్లు ఉన్నాయి.కరెంటు ఉండటం వల్ల అందరి యిళ్ళలో విద్యుత్ దీపాలు,పంకాలు,ఫ్రిజ్లూ ,ఫోన్లూ ఉన్నాయి,కొంతమందికి కార్లు,ఏ.సీ.లు ,మోటారు సైకిళ్ళు ఉన్నవి.ఊర్లోనే ఒక స్కూలు కూడా ఉంది.
  రైతుల ఇళ్ళు కూడా 100 గడపల దాకా ఉన్నాయి.పూరిళ్ళు దాదాపు మాయం ఔతున్నవి.సిమెంటు ,ఇటుకల తో కట్టిన డాబా ఇళ్ళు ఎక్కువగా ఉన్నాయి.ట్రాక్టర్లు ,మోటారు పంపులూ వాడుతున్నారు. ఊళ్ళో మంచి నీటి కొళాయిలు కూడా ఉన్నాయి.
  బ్రాహ్మల ఇళ్ళు మాత్రం పాతవే ఉన్నా గట్టిగానే ఉన్నాయి.ఇటుకలు,మట్టితో నిర్మించారు.కొన్ని పెంకుటిళ్ళు,కొన్ని డాబా యిళ్ళు.to be continued.      

state policy.


 

 15-1-12 ఈనాడు పత్రికలో గురుచరణ్దాస్ అనే ప్రసిద్ధ జర్నలిస్టు రాసిన వ్యాసం తెలుగు అనువాదం నాకు నచ్చింది.దానిలోని అంశాలు క్లుప్తంగా ఇస్తున్నాను.
 1.మనదేశం చరిత్రలో ఎప్పుడూ సంపన్న మైనదే ఐనా ,చిన్నరాజ్యాలు ,అంతహ్కలహాలవల్ల పతనమయ్యేది.సామ్రాజ్యాలు పెద్దవి ఏర్పడినా అవికూడా పరిపాలనా రీత్యా బలహీనమైనవే.
 2.బ్రిటిష్ వాళ్ళు బలమైన పరిపాలనా యంత్రాంగం, సుశిక్షిత మిలిటరీ, న్యాయ వ్యవస్థను ఇచ్చి వెళ్ళి పోయారు.
 3.మనరాజ్యం ప్రభుత్వం కన్నా మన సమాజం,సంస్కృతీ బలమైనవి.
 4.మనదేశం గణనీయమైన అభివృద్ధి సాధించినా ,మనప్రధాన లోపం బలహీనమైన రాజ్యం (state) నిర్ణయాలు తీసుకోడంలో విపరీతమైన జాప్యం.ఆచరణలో కూడా విపరీతమైన అలసత్వం.
 5.బలమైన కేంద్ర,రాష్త్ర ప్రభుత్వాలు అవసరం.
 6.అలా అని నియంతృత్వం మంచిది కాదు.
 7.ప్రజాస్వామిక ప్రభుత్వమే బలంగాను,కఠినం గాను ఉండాలి.ఉదారంగాను, క్షెమంకరంగాను ఉండాలి.కోర్టులు కూడా అలాగే ఉండాలి. ఒక మాటలో  చెప్పాలంటే 'దుష్ట శిక్షణ ,శిష్ట  రక్షణ' చెయ్యాలి.
 8.రాజకీయ జోక్యం, అవినీతిని సహించకూడదు.పై సిద్ధాంతాలు పాటిస్తే ప్రజాస్వామికంగానే మనం సత్వర పురోభివృద్ధి సాధించగలము.
   మొత్తం మీద గురుచరణ్ దాసు చెప్పేదేమంటే ప్రజాస్వామిక మంటే అరాచకమూ,క్రమశిక్షణా రాహిత్యమూ కాదు.పాశ్చాత్యదెశాల వలెనే వ్యక్తిస్వేచ్చతో బాటు క్రమశిక్షణా,  రూల్స్ ని కఠినంగా  పాటించడం కూడా.
 

13, జనవరి 2012, శుక్రవారం

bhogimantalu


 

 ఈ సంక్రాంతి శుభ వారంలో మరొక సారి అందరికీ శుభాకాంక్షలు.-ముఖ్యంగా దూర ంగా ఇతర రాష్ట్రాల్లో,విదేశాల్లో వున్న వారికి.మా శ్రీకాకుళంలో మాత్రం బాగా చలిగా వుంది.శీతాకాలాన్ని,సంక్రాంతిని ముందే పద్యాల్లో వర్ణించి వుండటం చేత మళ్ళీ వ్రాసి కవిత్వంతో విసిగించదల్చు కో లేదు.ఈ రోజుల్లో ఇంతకు ముందు లాగ వచ్చే జానపద కళా కారులు,భిక్షుకులు, బాగా తగ్గిపోయారు.గంగిరెద్దులవాళ్ళు మాత్రం కొందరు వస్తున్నారు.కాని వాళ్ళు సినిమా పాటలు సన్నాయి తో వాయిస్తున్నారు !
  మా ఇంటి ఆవరణలో పిల్లలు  పెద్ద భోగి మంట వేసారు.ఈ రోజుల్లో independent గా ఇల్లు,చుట్టూ తోట ఉండటం లగ్జరీ అంటున్నారు.మాకలాంటి ఇల్లు ఉండటం ఆనందం గాఉంది.కాని, హైదరాబాదు,విశాఖ, లోనేగాక, జిల్లా కేంద్రాల్లోను, ఇతర పట్టణాల్లోను  కూడా ఈ అపార్టుమెంటు కల్చర్ వ్యాపిస్తూ ఉండటం శోచనీయమే.చివరికి  పల్లెల్లో మాత్రమే అలాంటి ఇళ్ళు మిగులుతాయేమో .కాని ఏమిచేస్తాము ?భూమి,నిర్మాణ వ్యయం కొండెక్కడం తో తప్పదనుకొంటాను.    

12, జనవరి 2012, గురువారం

GOOD WISHES.


 

  ఈ సంక్రాంతి మహోత్సవావసరమందీ చంద్రికా రాత్రులన్,
  ఏ సీమన్ గనినన్ వినోదములతో నింపారు గేహమ్ములన్,
  రాసుల్ పోసిన ధాన్య సంపదలతో రాణించు గ్రామమ్ములున్,
  భాసించెన్ హిమశీత వాయువులు  ,సద్భావమ్ము వర్ధిల్లగన్
              -----------------
    పౌష్యలక్ష్మిచే వెలుగునీ ప్రకృతి యెల్ల
    'బ్లాగు '  మిత్రులందరికి సౌభాగ్య మలర
    ఆయురారోగ్య సంపద లమరు గాత !  
    అని శుభాకాంక్ష లందింతు నమల బుద్ధి ,
           -------------- 

11, జనవరి 2012, బుధవారం

కమనీయం: aahaaryam

కమనీయం: aahaaryam koodali.org

10, జనవరి 2012, మంగళవారం

aahaaryam-contd.


 

 1-1-2012 ఆంధ్రజ్యోతి హాస్యసంచికలో Y.A.రమణగారి అసూబా అనే బ్లాగు చదివి దానికి కొనసాగింపుగా ఆయనకు కృతజ్ఞతలతో ఇది రాస్తున్నాను.దీనికి ముందటి నా బ్లాగు కూడా చూడండి.దానికిది కొనసాగింపు.
  విష్ణుమూర్తీ,పరమశివుడే కాదు,లక్ష్మీ దేవి,సరస్వతీ కూడా కిరీటాలు,పద్మం ,వీణ ఇత్యాది హంగులు లేకుండా కనిపిస్తే పోల్చుకో లేము.
  మాటవరసకి, కృష్ణ దేవరాయలు మనమధ్యకి వచ్చాడనుకోండి.ముత్యాలు,తురాయి పొదిగిన తలపాగా,కోరమీసాలు,కత్తీ అవీ లేకుండా వస్తే ఖాతరు చెయ్యం. షాజహాన్ చక్రవర్తి, సిల్కు తలపాగా ,మొఘల్ దుస్తులూ ,ముత్యాలహారాలూ,గడ్డం  లెకుండా,వస్తే ఎవరు నువ్వు అంటాము.పురాణాలు,చరిత్ర,వదిలేసి 20,21,శతాబ్దాలకి వస్తే 50,60,ఏళ్ళకిందట వేషాన్ని బట్టి కులాన్ని,మతాన్ని పోల్చుకొనేవీలు ఉండేది.అలాగే తమిళ్,బెంగాలీ ,గుజరాతీ ,పంజాబీ ప్రాంతాలవాళ్ళని నోరు విప్పకపోయినా తెలిసిపోయేది.ఇప్పుడలా కాదుకదా!
   మా చిన్నప్పుడు,పోలీసులకి ఎర్రటోపీలు ఉండేవి.ఇన్స్పెక్టర్లకు ఎర్రతలపాగాలు (బంగారు అంచుతో) ఉండేవి.అసలు ఎర్రటోపీ అంటేనే పోలీసు అని అర్థం.దానికి తోడు ఖాకీ డ్రెస్సు. ఇవేమీ లేకుండా వెళితే ఎవరు పట్టించుకొంటారు ?
  ఒక్క అసూబాలే కాదు(అమెరికా సూటు బాబులు ) మన దేశంలో కూడా ప్రైవేటు బేంకు ఆఫీసర్లు,కంపెనీ ఎగ్జెక్యూటివ్లూ,మెడికల్ రెప్రజెంటేటివ్లు, కూడా సూటుబాబులే.వా ళ్ళకది తప్పనిసరి,ఉక్కపోత,చెమట్లు తో ఉడికి పోతున్నా.ఎక్కడికైనా సూటు తో కారులో వెళ్ళారనుకోండి.ఆ మర్యాదలే వేరు.(చార్జీలు,ధరలూ ఎక్కువ వాయించేస్తారనుకోండి.)
  ఒకప్పుడు,రాజకీయనాయకులకు ,దేశభక్తులకు చిహ్నం ;ఖద్దరు పంచె ,నెహ్రూ కోటు,గాంధీ టోపీ .ఇప్పుడు వాటిని అవినీతికి,మోసానికి చిహ్నాలుగ కార్టూన్లలో చూపిస్తున్నారు.హతవిధీ!అలాగే ఒకప్పుడు షరాయి ,పొడుగు లాల్చీ ,గడ్డం ,పక్కసంచీ ఉంటే  కమ్యూనిస్టు,లేక కనీసం లెఫ్టిస్టు రాడికల్ అన్న మాట.అందువల్ల ఆహార్యం లో ఏముంది అని కొట్టివేయకండి.అందులో చాలా ఉంది.
  ఇందులో ఆడవాళ్ళ ఆహార్యం గురించి రాయలేదు.మీరెవరు ,మా యిష్టం అనవచ్చును.వాళ్ళ లోనే ఎవరైనా రాస్తే బాగుంటుంది.    
       'వైద్య వర్యులకు ధవళ వర్ణ కోటు ,
        న్యాయమూర్తులకెల్లను నల్ల కోటు,
        ఘనులు పోలీసు వారికి ఖాకి తగును
        చిత్రమగు వేష మొప్పును చిత్రసీమ.
 
     అసూబాలో రమణ గారు చెప్పినట్లు ,మన వేడి దేశంలో యోగి వేమన ఆహార్యమే ఉత్తమం కాని ,అది మరీ ఘోరం గా ఉంటుంది కాబట్టి ,మగవాళ్ళకి లుంగీ,పైన తుండు గుడ్డ  బెస్టు.

9, జనవరి 2012, సోమవారం

aahaaryam


 

 ఆహార్యం  అంటే దుస్తులు.అలంకరణలు అని అర్థం.తిండి అని కాదు,నాటకాల్లోను.సినిమాల్లోను ,ముఖ్యంగా పౌరాణికాల్లో చాలా ముఖ్యం.మా చిన్నప్పుడు  స్కూల్ మాస్టెర్లు ధోవతి.జుబ్బా, కండువా వేసుకొని వచ్చే వాళ్ళు.కొందరు కోటు,తలపాగాతో వచ్చేవాళ్ళు.ఎవరు మాస్టరో ఎవ రు స్టూడెంటో సులభంగా తెలిసేది.ఇప్పుడు మాస్టర్లు.స్టూదెంట్లూ ఒకే లాగ ఉంటారు.
  మెడికల్ కాలేజీలొ  మేము తెల్ల షర్టూ పాంటూ టక్ చేసుకొనే వాళ్ళం.పొట్టీ చేతుల తెల్లకోటు వేసుకోవాలి.బూట్లే కాని చెప్పులు వేసుకోకూడదు.మా ప్రొఫెసర్లు సూటూ .ట్   ఐ వేసుకొనే వాళ్ళు.భేదం తెలిసేది.ఒక ప్రొఫెసర్ రోజూ కోటు  వేసుకొని వచ్చి .అది హాంగెర్కి తగిలించి తెల్లకోటు వేసుకునే వాడు.ఎప్పుడూ ఒకే రంగు వేసుకొనే వారు .ఒక కొంటే నర్సు ఆయన కోటు మీద ఒకమూల తేదీ వేసింది.నెల రోజుల తర్వాత  కూడా   ఆతేదె ఉన్న కొటే ఆయన వేసుకొని వచ్చారు. to be cotinurd.   

7, జనవరి 2012, శనివారం

epics



 EPICSఎపిక్ అంటే గ్రీకు భాషలో కథ,కావ్యం ,అని అర్థం.ఐతే అన్ని కథలూ,  ,కావ్యాలూ  ,ఎపిక్స్ కాలేవు.తెలుగులో వీటిని మహాకావ్యాలు అనవచ్చును.ప్రాచీన గ్రీకు భాషలో హోమర్  రచించిన 'ఇలియడ్, ఒడెస్సీ ' ,అపొల్లోనియస్ 'ఆర్గొనాటికా',లాటిన్ భాషలో వర్జిల్ కావ్యం 'ఏనియడ్ 'ఈ కోవలోకి వస్తాయి.మొదట్లో వీటిని గానం చేసేవారు.  తర్వాతి కాలం లోనే గ్రంథస్థం చేసారు.మన రామాయణం ,మహాభారతం ప్రపంచంలోనే గొప్ప ఎపిక్స్ గా పరిగణింపబడుతున్నవి.ప్రాచీన పర్షియా రాజవంశాల కథ 'షానామా' ఒక ఎపిక్ .ఆ దేశాల్లో అప్పటి మతాలు అంతరించి పోవడం వలన వాటిని కేవలం గొప్ప కావ్యాలు గానే భావిస్తారు.మన దేశంలో హిందూ మతం ఇంకా ప్రబలంగా ఉండుట వలన రామాయణ ,భారతాలను పవిత్ర మతగ్రంథాలుగా భావిస్తాము.వీటి మీద అనేక చర్చలు, వ్యాఖ్యలు ,వాదోప వాదాలు ,ఖండనమండనలు,జరుగుతున్నవి.కాని వాటి జోలికి పోదలచు కోలేదు.ఇన్ని వేలసంవత్సరాల పిదప కూడా ఇవి ఇంత ప్రాచుర్యం లో  ఉండటానికి కారణమేమిటి?ఎపిక్స్ ముఖ్య లక్షణాలను పరిశీలిస్తే అర్థమౌతుంది.
  1,ఎపిక్ ఆ దేశపు ,జాతి, ఆశయాలను, ఆవేశాలను,లక్ష్యాలను ప్రతిబింబిస్తుంది.
  2.దీర్ఘమైన కథతో మలుపులు తిరుగుతూ ,అనేక సంఘటనలతో నిండి ఉంటుంది,
  3.హీరో, హీరోల సాహస కృత్యాలు చిత్రింపబడి ఉంటాయి.శౌర్యం, ప్రతాపం ముఖ్యం.
  4.చాలా ఎపిక్స్ లో దేశ కాలాల కేన్వాసు బాగా విస్తరించి ఉంటుంది.
  5.అన్నికాలాలకీ ,దేశాలకి, అన్వయించే విషయాలు కూడా కొన్ని ఉంటాయి.
  6.నాయికా,నాయకులు అనేక కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని చివరకు విజయం సాధిస్తారు.
   7.కొన్ని అద్భుతాలు,అతీంద్రియ శక్తులు ,దేవతల ప్రవేశం ఉండవచ్చును.
   8.మానవులు ఇప్పటికీ యుద్ధప్రియులే. ఎపిక్స్ లో సాదారణంగా చివర్లో మహా   యుద్ధం,అందులో నాయకుడు విలన్ల మీద అంతిమ విజయం సాధిస్తాడు.
  9.దీర్ఘ ప్రయాణాలు, వర్ణనలూ ఎక్కువగా ఉంటాయి.
  పై కారణాల వలన ఈ ఎపిక్స్ అన్నీ ఇప్పటికీ పాపులర్ గా ఉన్నాయి.పైగా మన రామాయణ భారతాలు ,బైబిలు ,పవిత్ర మతగ్రంథాలు  గా కూడా గౌరవింప బడటం చివరి కారణం.నేటి  సినిమాల్లో కూడా ఇవే సూత్రాలను అనుసరించడం గమనించ వలసిన విషయం.