13, ఫిబ్రవరి 2015, శుక్రవారం

Dr.Kesavareddi.




 డాక్టర్ కేశవరెడ్డి గారి మరణ వార్త చదివి బాధపడ్డాను.ఆయనతో నాకు  పరిచయం లేకపోయినా, ఆయన నవలలు కొన్ని చదివాను.ప్రసిద్ధ రచయిత.''ఇంక్రెడిబుల్ గాడెస్  ',రాముడున్నాడు రాజ్యమున్నాది ' వంటి నవలలు రచించారు.ఆయన నవల 'అతడు అడవిని జయించాడు '  హెమింగ్వే నవల ' oldman and sea  'కి అనుకరణ.'మునెమ్మ ' నవల కూడా కొన్ని విమర్శలకు గురయింది.ఆయన నవలలన్నీ   పల్లెటూళ్ళ వాతావరణం  తో అతి సామాన్యుల జీవితాలకి అద్దం పడతాయి.
    వైద్యునిగా కూడా కుష్టు  రోగులకు ఆయన చేసిన సేవలు స్మరణీయమైనవి .నా సంతాపాన్ని ఈ విధంగా తెలియ జేసుకొంటున్నాను. 

9, జనవరి 2015, శుక్రవారం

pelli market




 ఆడపిల్ల పెళ్ళి గురించి మధ్యతరగతి కుటుంబాలలో బెంగపెట్టుకోవడం,నానా తంటాలు పడి ఎలాగో పెళ్ళి చేసి పెద్ద బరువు దించుకొన్నట్లు ఫీలవడం మామూలే.ఐతే ఈ మధ్య,ముఖ్యంగా ఉన్నతవిద్యావంతులైన మధ్యతరగతి కుటుంబాల్లో ఈ పరిస్థితి తిరగ బడ్డాదేమో ననిపిస్తున్నది.అమ్మాయిలు బాగా చదివి మంచి ఉద్యోగాలు  చేస్తున్నవారు తల్లిదండ్రులు చెప్పినట్లు ఎవరినైనా పెళ్ళి చేసుకోడానికి ఒప్పుకోటం లేదు.వరుడు కూడా తనపాటైనా చదువుకొని మంచి జాబ్ చేస్తూఉండాలి.వయస్సు తేడా ఎక్కువ ఉండ కూడదు,అని షరతులు పెట్టుతున్నారు.అంచేత మగవాళ్ళకి మంచి ,తగిన అమ్మాయిలు దొరకడం లేదు.నాకు తెలిసిన కొందరు పెళ్ళికొడుకులకు తగిన వధువులు దొరకడం లేదు.వాళ్ళకి  30 ఏళ్ళు దాటిపోయాయి.ఏవో కారణాలవలన,మంచి క్వాలిఫికేషన్లు  ,ఉద్యోగాలు ఉన్నా, పెళ్ళి ఆలస్యమై ఇప్పుడు కావాలన్నా పెళ్ళికుదరటం  లేదు.దీన్నిబట్టి చూస్తే మధ్యతరగతి,విద్యావంతుల్లో పెళ్ళి మార్కెట్ తిరగబడిందా అనిపిస్తున్నది.

22, డిసెంబర్ 2014, సోమవారం

20, డిసెంబర్ 2014, శనివారం

Sri.D.V.Subbarao.




 శ్రీ డి.వి.సుబ్బారావుగారి తో నాకు బాగా పరిచయముంది.ఆయన వివిధరంగాల్లో ప్రసిద్దికెక్కారు. న్యాయవాదిగా,క్రికెట్ అఫిషియల్గా,విశాఖ మేయర్గా వినుతిచెందారు.ముఖ్యంగా  మేయర్గా విశాఖను సుందరంగా అభివృద్ధి చెయ్యడంలో ఆయన కృషి ప్రశంసనీయం.వ్యక్తిగా కూడా స్నేహశీలుడు,నిజాయితీపరుడు, మేధావి .ఆయన మరణవార్త నన్ను కలచివేసింది.అయనకు నా నివాళి, శ్రద్ధాంజలి అర్పిస్తున్నాను.ఆయన కుటుంబసభ్యులకు నా సానుభూతి  తెలుపుకొంటున్నాను.

17, డిసెంబర్ 2014, బుధవారం

premature deaths


 
శీర్షిక
--------
  ఈ మధ్య కొందరు ప్రముఖులు,సినీ,సాహితీ,రాజకీయ రంగాలలోవారు అకాల మృత్యువు బారిన పడుతున్నట్లు చదవడం కలవరపెడుతున్నది. ప్రసిద్ధులు కాకపోయినా ఇతర రంగాలలో కూడా ( వైద్యరంగంతోసహా) ఇలాగే జరుగుతున్నది.కర్మానుసారం జరుగుతుందనే  మాట పక్కన పెడితే,మానవ ప్రయత్నాలు ఏం చెయ్యాలంటే;
    1.40సం:దాటిన ప్రతి మనిషి  ఏడాదికొకసారి  మెడికల్ చెకప్ చేయించుకోవాలి.
    2.చెకప్ లో  ఏవైన,అధిక రక్తపోటు మధుమేహలక్షణాలు కనిపిస్తే  తగిన చికిత్స తీసుకోవాలి.
     3.మద్యపానం,ధూమపానం మానివేయాలి.
   4.  డబ్బు సంపాదించాలి కాని దానికోసం ఆరోగ్యాన్ని బలిపెట్టకూడదు.
      5.జీవితవిధానాన్ని life style ని తగిన విధంగా మార్చుకోవాలి. ఆహరనియంత్రణ,తగుమాత్రం వ్యాయామం  అవసరం.
     6.ముఖ్యంగా  జబ్బుని దాచుకోకూడదు.జీవితభాగస్వామి,లేక దగ్గరి బంధువుల సహకారం తీసుకోవాలి. 

11, డిసెంబర్ 2014, గురువారం

కమనీయం: o,visakhaa!

కమనీయం: o,visakhaa



  !

o,visakhaa!


 

 విశాఖా!ఓ విశాఖా,నావిశాఖా!
----------------------
     
          పసిప్రాయంలో నీ వడిలో పరుండితి,
          నీలతరంగ హస్తాలతో నిమిరావు నన్ను.
          ఎల జవ్వనములో కోరి వలచాను నిన్ను,
 తరులతా కుంతలాల మురిపించావు నన్ను
          సుందర విశాఖా!విలాసరేఖా!

            నీ శైల కందరాలలో
            సానుప్రదేశాలలో
            సైకతచుంబిఫేనరాశుల్లో
            సంధ్యామారుతసౌరభాల్లో
            చంద్రోదయసువర్ణరోచుల్లో
            అలలపై జలతారుదారుల్లో
            ఉదయారుణజలదపంక్తుల్లో
            ఆడియాడి అలసి నిదురించాను
               సుందరవిశాఖా! విలాసరేఖా!
             సుదూరంలో నౌకోపరితలం నుండి
             నీహారదుకూలపరీవృతమైన
             నీ తీర సౌభాగ్యాన్ని తిలకించినాను .
             తిలకించి,తిలకించి పరవశించాను
                సుందరవిశాఖా!విలాసరేఖా!
                 విశాఖా!,ఓ విశాఖా,నా విశాఖా!